మధ్యప్రదేశ్ భోపాల్లోని కేంద్ర కారాగారంలో ఉన్న 'స్టూడెంట్స్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా' (ఎస్ఐఎంఐ) ఉగ్రవాదులు నిరాహార దీక్ష చేపట్టారు. తమను సాధారణ గదుల్లోకి మార్చాలని డిమాండ్ చేస్తూ.. గత 3 రోజులుగా ఆహారం తీసుకోకుండా నిరసన తెలుపుతున్నారు.
ఎస్ఐఎంఐకి చెందిన సభ్యులు హత్య, దోపిడీ, రాజద్రోహం వంటి వివిధ నేరాల కింద జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అయితే.. కొద్ది రోజుల క్రితం అందులో కొందరు జైలు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. అప్పటి నుంచి వారికి భద్రత పెంచి.. ప్రత్యేక పరిశీలనలో ఉంచారు అధికారులు. 24 గంటల పాటు వారిపై నిఘా పెట్టేందుకు సీసీటీవీ కెమెరాలు సైతం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ఇతర ఖైదీలు, జైలు అధికారులతో దుష్ప్రవర్తన, గొడవలు పెట్టుకోవటం వంటివి గుర్తించి వారందరినీ పటిష్ఠ భద్రతతో కొత్తగా ఏర్పాటు చేసిన 'అండా సెల్'కు మార్చారు.
తమను ప్రత్యేక గదుల నుంచి సాధారణ గదుల్లోకి మార్చాలని డిమాండ్ చేస్తూ.. మూడు రోజులుగా నిరాహార దీక్షకు దిగారు ఎస్ఐఎంఐ ఖైదీలు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ కేంద్ర కారాగారంలో వీరు 28 మంది ఉన్నారు. అందులో అబు ఫైజల్, అన్సార్, శివాలి, కమరుద్దీన్, షదులిలూ తమను సాధారణ ఖైదీల్లానే స్వేచ్ఛగా తిరగనియ్యటం సహా క్యాంటీన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే వార్తా పత్రికలను కూడా అందించాలని కోరుతున్నారు.
నిబంధనల మేరకే..
ప్రస్తుతం వారిని వైద్యుడు పరిశీలించి.. గ్లూకోజ్ ఇచ్చినట్లు తెలిపారు జైలు సూపరింటెండెంట్ దినేశ్ నార్గేవ్. నిబంధనల ప్రకారం ఖైధీలకు అందించాల్సిన అన్ని సౌకర్యాలు వారికీ ఇస్తున్నట్లు చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా తాము ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోమన్నారు.
ఇదీ చూడండి: భారీ భద్రతతో పటిష్ఠ కోటలా 'హాథ్రస్' గ్రామం