మావోయిస్టుల ఏరివేతలో భాగంగా 17 మందిని మట్టుబెట్టినట్లు ఛత్తీస్గఢ్ పోలీసులు ఏడేళ్ల క్రితం చేసిన ప్రకటన నిజం కాదని తేలింది. 2012 జూన్ 28న బీజాపుర్ జిల్లాలోని సర్కేగుడ వద్ద కాల్పుల్లో చనిపోయిన వీరంతా సాధారణ గ్రామస్థులేనని జస్టిస్ విజయ్కుమార్ అగర్వాల్ నేతృత్వంలోని ఏకసభ్య విచారణ కమిటీ తేల్చింది. ఏడేళ్లపాటు విచారించిన తర్వాత 45 రోజుల క్రితం కమిటీ ఈ మేరకు నివేదిక సమర్పించినట్లు ఆదివారం వెల్లడయింది. ‘‘అవతలివారే కాల్పులు జరిపారని చెప్పడం తప్పు. వారే కాల్పులు జరిపారని, వారంతా మావోయిస్టులేనని చెప్పే ఎలాంటి రుజువుల్ని భద్రత బలగాలు సమర్పించలేకపోయాయి. తుపాకులను, తూటాలను ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పడం కూడా తప్పు’’ అని కమిటీ నివేదిక పేర్కొంది.
ఘటనపై పోలీసు దర్యాప్తు లోపభూయిష్టంగా ఉందని వ్యాఖ్యానించింది. గ్రామస్థుల పోరాటం ఎట్టకేలకు ఫలించిందని వారి తరఫు న్యాయవాది ఇషా ఖండేల్వాల్ చెప్పారు. తమ ఎదురుకాల్పుల్లో 17 మంది మావోయిస్టులు మరణించినట్లు పోలీసులు ప్రకటించడం 2012లో సంచలనం సృష్టించింది. అప్పటి భాజపా ప్రభుత్వం దీనిపై ఏకసభ్య కమిషన్ను నియమించింది. జస్టిస్ అగర్వాల్ ఈ ఏడాది అక్టోబరు17న నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. శనివారం రాత్రి పొద్దుపోయాక జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో దీనిని ఆమోదించి, సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టారు.
ఇదీ చూడండి:రూపుమారిన మహారాష్ట్ర రాజకీయం