ఇకపై క్రియాశీల రాజకీయాల్లో తాను ఉంటానని తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి, అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ ప్రకటించారు. అక్రమాస్తుల కేసులో అరెస్టై బెంగళూరు జైలులో నాలుగేళ్లు జైలు శిక్ష అనుభవించిన ఆమె సోమవారమే తమిళనాడుకు చేరుకున్నారు. తాను తమిళ ప్రజలకు రుణపడి ఉంటానని ఆమె అన్నారు. కానీ, అణచివేతకు తలవంచనని పేర్కొన్నారు. వీటితో పాటు పలు కీలక ప్రశ్నలకు ఆమె బదులిచ్చారు.
- ప్ర. చెన్నైలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయానికి మీరు వెళ్తారా?
జ: వేచి చూడండి.. ఏం జరుగుతుందో.
- ప్ర. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతోన్న వేళ క్రియాశీల రాజకీయాల్లో ఉంటారా?
జ: పార్టీ కార్యకర్తల కోసం తప్పకుండా ఉంటా.
- ప్ర. అన్నాడీఎంకే పార్టీ జెండాను మీ కారుపై ఉపయోగించడంపై కొంతమంది మంత్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు? దీనిపై మీరు ఏమంటారు?
జ: ఇలాంటివి వింటుంటే వారు భయపడుతున్నారని తెలుస్తోంది.
- ప్ర: మీరు వస్తున్న సమయంలోనే దివంగత జయలలిత సమాధి స్థలాన్ని శుభ్రం చేయడానికి మూసివేస్తున్నామని ప్రకటించడాన్ని ఏమంటారు?
జ: ఇదంతా ఎందుకు చేస్తున్నారో తమిళ ప్రజలకు బాగా తెలుసు.
- ప్ర: అన్నాడీఎంకే పార్టీని హస్తగతం చేసుకోమని అభిమానులు మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు సిద్ధమేనా?
జ: అందర్నీ నేను త్వరలోనే కలుస్తాను. అప్పుడు వివరంగా మాట్లాడుకుందాం.
శశికళ చెప్పిన సమాధానాలతో, ఆమె రాకతో తమిళనాడు రాజకీయాల్లో ఎలాంటి మార్పులు జరగనున్నాయోనని విశ్లేషకులు, ప్రజలు చర్చించుకుంటున్నారు.
మళ్లీ ఆ పదవి కోసం..
2021 జనవరి 27.. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత స్మారకాన్ని అన్నాడీఎంకే నాయకద్వయం పళనిస్వామి, పనీర్సెల్వం ఆవిష్కరించిన ఈ రోజే.. ఆ పార్టీ వేటుకు గురైన తలైవి నెచ్చెలి వీకే శశికళ.. జైలుబంధం నుంచి విముక్తులయ్యారు. జయలలిత మరణం తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న చిన్నమ్మ.. మళ్లీ ఆ పదవిని దక్కించుకునేందుకు అన్ని దారులు వెతుకుతున్నారు. అన్నాడీఎంకేలో 'కీలక హోదా' అధిరోహించేంత వరకు ఆమె విశ్రమించరని శశికళ సన్నిహితులు సైతం చెబుతున్నారు. ఈ పరిణామాలు తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపులకు కారణమవుతాయని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.
ఈ విషయంపై ఉన్న అభిప్రాయభేదాలను పరిష్కరించేందుకు భాజపా అగ్రనేతల మధ్యవర్తిత్వంతో పళనిస్వామి, పనీర్సెల్వం- శశికళ మేనల్లుడు దినకరన్ మధ్య అనధికార చర్చలు జరిగినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఒకవేళ పార్టీ అధికార పగ్గాలు తనకు అప్పగిస్తే స్వీకరించేందుకు శశికళ సిద్ధంగా ఉంటారని, లేదంటే అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా పనిచేస్తారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. పళనిస్వామి, పనీర్సెల్వంను అధికార పీఠం నుంచి దించేందుకు పావులు కదుపుతారని అంటున్నారు. పార్టీ అభిమానులను, మద్దతుదారులను తనవైపు లాక్కుంటారని విశ్లేషిస్తున్నారు.
"జయలలితకు అత్యంత సన్నిహితంగా ఉండటం కూడా శశికళకు శిక్ష పడటానికి ఓ కారణం. జైలు శిక్ష అనుభవించిన తర్వాత డెల్టా, దక్షిణ తమిళనాడు ప్రాంతాల్లో శశికళకు సానుభూతి పెరిగింది. థెవార్ వర్గానికి ఈ ప్రాంతాల్లో మంచి పట్టుంది. ఇక్కడ అన్నాడీఎంకే ఓడిపోతే పార్టీలో పరిణామాలు మారిపోతాయి."
-రాజకీయ విశ్లేషకులు
జయలలిత మరణాంతరం ముఖ్యమంత్రి అభ్యర్థిగా శశికళ ఎంపిక చేసిన ఎడప్పాడి పళనిస్వామి మాత్రం తనను సీఎం కుర్చీపై కూర్చొబెట్టింది ఎమ్మెల్యేలే అని, చిన్నమ్మ కాదని చెబుతూ వస్తున్నారు. పళనిస్వామి, పనీర్సెల్వం ఐక్యంగా ఉన్నట్లే పైకి కనిపిస్తున్నారు. అయితే అధికార పంపిణీ విషయంలో లోపల ఇంకా విభేదాలు ఉన్నాయని పార్టీ వర్గాలు సైతం ధ్రువీకరిస్తున్నాయి. జయలలిత విధేయుడిగా చెప్పుకుంటూ పత్రికలు, టీవీ ఛానెళ్లలో వ్యక్తిగతంగా పనీర్సెల్వం ప్రచారం చేసుకోవడం ఇందుకు బలం చేకూర్చుతోంది.
ఇదీ చదవండి:'చిన్నమ్మ వస్తే తమిళనాడులో అల్లర్లే'