గీతా ప్రాముఖ్యం గురించి భారతీయులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందులోని ప్రతి అధ్యాయమూ ఓ ఆణిముత్యమే. అలాంటి పవిత్ర గ్రంథాన్ని చదవాల్సిన అవసరమే లేకుండా కావాల్సిన అధ్యాయాన్ని శ్రవణానందం కలిగించేలా చదివి వినిపించే ప్రయత్నం చేస్తోంది సేఫ్షాప్ అనే సంస్థ. గీతలోని 18 అధ్యాయాలను మాటలు, పద్యాలు, శబ్దాలు, స్వరాలతో వినిపించే పరికరం రూపొందించింది.
దీంట్లో 18 అధ్యాయాలుంటాయి. 3 భాషల్లో 18 ఛాప్టర్లుంటాయి. ఫ్లూట్ అనే ఓ పరికరం ఉంటుంది. దాన్ని ఏ ఛాప్టర్ మీద పెడితే ఆ ఛాప్టర్ మొత్తం ప్లే అవుతుంది. హిందూధర్మం ప్రకారం ప్రతి ఇంటికీ భగవద్గీత ఉండాలని అందరికీ చెప్పాలనే ఈ భగవద్గీత తీసుకున్నాం.
-నాగేశ్వర్, వరంగల్ వాసి
పుస్తకం ముందు పెట్టుకుని, గంటలకొద్దీ చదవడం కుదరకపోవచ్చు. ఆ పరికరమే చదివి వినిపిస్తుంది కాబట్టి, ఏదైనా పని చేసుకుంటూ కూడా భగవద్గీత వింటూ ఉండొచ్చు.
-రమేష్, వరంగల్ వాసి
భగవద్గీతను సంస్కృతం, ఆంగ్లం, హిందీ భాషల్లో 463 పేజీల్లో ముద్రించారు. దానికి విజ్డమ్ ఫ్లూట్ పేరుతో ఓ పరికరం అనుసంధానించారు. అందులోని సెన్సర్ గ్రంథంలోని ప్రతి చిత్రాన్నీ ఆయా శబ్దాలు, స్వరాలతో వినిపిస్తుంది. పద్యాలు, పక్షుల కిలకిలరావాలు, శంఖచక్రాల శబ్దాలు, సెలయేటి గలగలలు, భీకర యుద్ధాలు..ఇలా ప్రతి సన్నివేశం అనుభూతిని అచ్చం అలానే అందిస్తుంది ఈ ఫ్లూట్. పదివేల రూపాయలు వెచ్చించి ఈ పుస్తకాన్ని కొన్న వరంగల్కు చెందిన నాగేశ్వర్, అతని మిత్రులు.. ఆ విశేషాలను పదిమందితోనూ పంచుకుంటున్నారు.
విజువల్ ఫ్లూట్ అనే ఓ పరికరం ఉంటుంది. దానికి ఛార్జింగ్ పెట్టి అక్షరాలు, బొమ్మల మీద ఆనించాలి. ఉదాహరణకు నీరు, ఆవులు, పిల్లనగ్రోవి, శంఖం ఇలా దేనిమీద ఆనిస్తే ఆయా శబ్దాలు వినిపిస్తాయి.
-రమేష్, వరంగల్ వాసి
ఈరోజుల్లో భగవద్గీతను ఎవరైనా చనిపోతేనే వినియోగిస్తున్న పరిస్థితులు. పిల్లలకు భగవద్గీత వినడం అలవాటు చేస్తే, హిందూ సంప్రదాయాన్ని చిన్నప్పటినుంచే వాళ్లకు చేరువ చేసినట్లవుతుంది. ఆ ఉద్దేశంతోనే ఈ భగవద్గీత పుస్తకాన్ని కొన్నా.
-శరత్బాబు, వరంగల్ వాసి
ఈ ఫ్లూట్ను ఒకసారి ఛార్జ్ చేస్తే, 3 నుంచి 4గంటల వరకు నిరంతరం పనిచేస్తుంది. చిన్న పిల్లలు, అంధులు, చదవలేని వారు గ్రంథాన్ని ఒళ్లో పెట్టుకుని, గీతను వినే అవకాశం కలుగుతోంది.
ఇదీ చదవండి:ఆమె వయసు 13.. రాసిన నవలలు 12