ఎన్డీఏ సర్కారుపై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్. జాతిపిత మహాత్మా గాంధీని హత్యచేసిన వారిని కీర్తించే వారు భాజపాలో ఉన్నారని ఆరోపించారు. ప్రస్తుతం దేశంలో విద్వేషం, మూకహత్యలు పతాక స్థాయికి చేరాయని తీవ్రంగా విమర్శించారు.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ పార్లమెంటులో తీర్మనాన్ని ప్రవేశ పెట్టి చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆజాద్ మాట్లాడుతూ... దేశంలో ఒకప్పుడు అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి ప్రేమానురాగాలతో ఆప్యాయంగా జీవించారని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. నేరాలు, బాలికలపై అత్యాచారాలు గతంలో ఎన్నడూ లేనంతగా జరుగుతున్నాయని ఆరోపించారు. హింస, మూకహత్యలకు జార్ఖండ్ నిలయమైందని ధ్వజమెత్తారు ఆజాద్. అన్ని మతాల ప్రజలు సంతోషంగా జీవించిన ఒకప్పటి భారత్ను తిరిగితీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఎన్డీఏకు పూర్తి మెజారిటీ ఉన్నందున మహిళలకు 50శాతం రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలన్నారు ఆజాద్.
ఇదీ చూడండి: 'దృఢమైన నాయకుని అవసరం కాంగ్రెస్ వల్లే తెలిసింది'