విదేశాల్లో చదువుకుంటున్న పిల్లలకు సొమ్ము పంపిస్తే దానిపై ఆదాయపు పన్ను చెల్లించాలా? టూర్ ప్యాకేజీ కింద విదేశీ పర్యటనలు చేసినా చెల్లించక తప్పదా? తాజా బడ్జెట్లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రతిపాదన ప్రకారం విదేశాలకు పంపిన ధనంపై 5% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 20సీని సవరించారు. ఇలా పంపిన సొమ్ముపై ‘మూలం వద్దే పన్ను వసూలు’ (ట్యాక్స్ కలెక్టడ్ అట్ సోర్స్ -టీసీఎస్) చేస్తారు. ఒకవేళ ఆదాయపు పన్ను చెల్లిస్తున్నవారయితే ఆ మొత్తాన్ని రిటర్నుల్లో చూపించుకొని ఆ మొత్తాన్ని వాపసుగా పొందవచ్చు.
ప్రస్తుతం అమల్లో ఉన్న సరళీకృత చెల్లింపుల విధానం (లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీం -ఎల్ఆర్ఎస్) కింద ఎవరైనా విదేశాల్లో ఉన్నవారికి 2.50 లక్షల డాలర్లు (రూ.1.77 కోట్లు) పంపించవచ్చు. ఈ అవకాశాన్ని విదేశాల్లో చదువుతున్న విద్యార్థులు, టూర్ ప్యాకేజీ నిర్వాహకులు అధికంగా ఉపయోగించుకుంటున్నారు. విదేశాల్లో ఉన్న బంధువుల ఖర్చులకు, బహుమతులకు, పెట్టుబడులకు కూడా ఈ మార్గాన్ని ఎంచుకోవచ్చు. ఈ పథకం కింద పంపించే సొమ్ము గత పదేళ్లలో 1400 శాతం మేర పెరిగింది. 2009-10లో ఒక బిలియన్ డాలర్ల (రూ.7,100 కోట్లు)సొమ్మును పంపించగా 2018-19లో అది 14 బిలియన్ డాలర్లు (రూ.99,400 కోట్లు)కు పెరిగింది. ఇలా సొమ్ము పంపించే వారిలో ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించనివారే ఎక్కువ సంఖ్యలో ఉండడం గమనార్హం. రిజర్వు బ్యాంకు జరిపిన అధ్యయనం ప్రకారం గత ఏడాది మొత్తం 14 బిలియన్ డాలర్లు పంపించగా అందులో టూర్ ప్యాకేజీల కోసం 4.8 బిలియన్ డాలర్లు (రూ.34,080 కోట్లు) విద్యార్థుల కోసం 3.5 బిలియన్ డాలర్లు (రూ.25,850 కోట్లు) పంపించారు. ఈ నిబంధనను వస్తువులు దిగుమతి చేసుకొనే కొంతమంది వ్యాపారులు స్వార్థానికి ఉపయోగించుకుంటున్నట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గుర్తించింది. మధ్య ప్రాచ్య దేశాలకు హవాలా మార్గంలో సొమ్ము పంపించడానికి ఎల్ఆర్ఎస్ను ఓ సాధానంగా మార్చుకొని పన్ను ఎగవేస్తున్నట్టు ఆధారాలు సేకరించింది. హవాలా లావాదేవీలు నివారించడానికే విదేశాలకు పంపించే సొమ్ముపై పన్ను వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పన్ను పరిధిలోకి మరింత మంది
ఆదాయపు పన్ను పరిధిలోకి మరింత మందిని తీసుకురావడం కూడా ఈ నిర్ణయం వెనుక ఉన్న మరో ఉద్దేశం. విదేశాల్లో ఉన్న విద్యార్థులకు సొమ్ము పంపిస్తున్న, టూర్ల ప్యాకేజీ కింద విదేశీ పర్యటనలు చేసిన 5000 మంది వివరాలను ఇటీవల రిజర్వు బ్యాంకు సేకరించింది. వీరిలో మూడొంతుల మంది అసలు ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించడం లేదని తేలింది. గత అయిదేళ్లలో మూడు కోట్ల మంది విదేశీ పర్యటనలు చేస్తే వారిలో 1.5 కోట్ల మందే ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పేర్కొనడం గమనార్హం. విదేశీ పర్యటనకు వెళ్లారంటే ఆర్థిక స్థోమత ఉన్నవారే అయిఉంటారని భావిస్తున్న ప్రభుత్వం వారందర్నీ పన్ను పరిధిలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. ప్రజలు ఖర్చు పెట్టే తీరులో భారీ మార్పులు కనిపిస్తున్నాయని, అయితే పన్ను వసూళ్లు అందుకుతగ్గట్టుగా లేవన్నది ప్రభుత్వ అంచనా.
వసూలు ఎక్కడ?
సాధారణంగా ఈ సొమ్మును అధీకృత డీలర్లయిన బ్యాంకులు, టూర్ ఆపరేటర్లు ద్వారా పంపిస్తారు. ఎవరైనా ఓ వ్యక్తి ఏడాదికి రూ.7 లక్షలకు మించి పంపిస్తే బ్యాంకులు, టూర్ ఆపరేటింగ్ సంస్థలు సొమ్మును చెల్లించిన సందర్భంలోనే 5% పన్ను (టీసీఎస్)ను వసూలు చేస్తాయి.
హవాలాను అడ్డుకోవడానికే: కేంద్రం
ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే వద్ద ‘ఈటీవీ భారత్’ ప్రస్తావించినప్పుడు ఇదేమీ కొత్త పన్ను కాదని, అదనపు పన్ను కూడా కాదని చెప్పారు. హవాలా లావాదేవీలను అడ్డుకోవడానికి చేస్తున్న ప్రయత్నమని తెలిపారు. ప్రస్తుతం టీడీఎస్ (ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్) కింద జీతాలు, ఇతర చెల్లింపుల్లో పన్ను మినహాయించి మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తున్నారని, టీసీఎస్ కూడా అలాంటిదేనని అన్నారు. విదేశాలకు సొమ్ము చెల్లించే వారంతా ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించేలా చూడడం దీని ఉద్దేశమని వివరించారు.
-అజయ్ భూషణ్