పండుగ వేళ 'వోకల్ ఫర్ లోకల్' నినాదాన్ని గుర్తుపెట్టుకొని ప్రజలు షాపింగ్ చేయాలని.. దేశీయ వస్తువులకు అధిక పాధాన్యం ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశీయ వస్తువులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోందని.. ఖాదీకి ప్రాముఖ్యత పెరుగుతోందన్నారు.
ఆదివారం 'మనసులో మాట' కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రధాని. కరోనా సంక్షోభంలో పండుగలు జరుపుకునే ప్రజలు సహనంతో మెలగాలని సూచించారు.
"పండుగ ఉత్సాహంతో షాపింగ్ కోసం బయటకు వెళ్లే ప్రజలు 'వోకల్ ఫర్ లోకల్' నినాదాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేశంలో రూపొందించిన వస్తువులకు ప్రాధాన్యం ఇవ్వాలి. అయితే ఒకప్పుడు పూజా మండపాలు కోలాహలంగా ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ముందుముందు ఎన్నో పండుగలను మనం అందరం జరుపుకోవాలి. అందుకోసం ఈ కరోనా సంక్షోభంలో నిగ్రహంతో కలిసి పనిచేయాల్సిందే."
-- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
సైనికులకు మద్దతుగా దీపాలు వెలిగించండి..
సరిహద్దులో విధులు నిర్వర్తిస్తూ.. శత్రువుల బారినుంచి దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతోన్న సైనికుల సేవలు, ధైర్య సాహసాలను పండుగ సమయంలో మరోసారి గుర్తుచేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దీపావళి, ఈద్ వంటి పండుగల సమయంలో తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ, దేశ సరిహద్దులను, మనల్ని సురక్షితంగా కాపాడుతోన్న సైనికులను గుర్తు చేసుకోవాలని కోరారు. ఇలాంటి సమయంలో సైనికులు, భద్రతా దళాలకు యావత్ దేశప్రజలు మద్దతుగా ఉన్నామని గుర్తుచేస్తూ పండుగరోజు తమతమ ఇళ్లలో దీపాలు వెలిగించాలని దేశప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని ఈవిధంగా స్పందించారు.
ఇదీ చూడండి:- 'భారత సైన్యం ఉండగా.. అంగుళం కూడా ఆక్రమించుకోలేరు'