తమిళనాడులోని ఓ గ్రామస్థులతో రాహుల్ గాంధీ మష్రూమ్(పుట్టగొడుగులు) బిర్యానీ ఆస్వాదిస్తున్న వీడియో అంతర్జాలంలో వైరల్గా మారింది. 'విలేజ్ కుకింగ్ ఛానెల్' అనే హ్యాండిల్ ఈ వీడియోను యూట్యూబ్లో అప్లోడ్ చేసింది. కొందరు గ్రామస్థులతో కలిసి రాహుల్.. ఆహారం సిద్ధం చేయడం, భోజనం చేయడం వంటి దృశ్యాలు ఇందులో కనిపిస్తున్నాయి. గతవారం రాహుల్ తమిళనాడు పర్యటన సందర్భంగా ఈ వీడియో చిత్రీకరించినట్లు తెలుస్తోంది.
వంటకాలు సిద్ధం చేసే సమయంలో వాటి పేర్లను తమిళంలో అడిగి తెలుసుకున్నారు రాహుల్. భోజనానికి ముందు వారితో కలిసి ముచ్చటించారు. అమెరికా వెళ్లాలని ఉందని అందులో ఒకరు చెప్పగా.. అందుకు తాను సహాయం చేస్తానని రాహుల్ హామీ ఇచ్చారు. తన స్నేహితుడు సామ్ పిట్రోడా ద్వారా ఏర్పాట్లు చేయిస్తానని చెప్పారు. అనంతరం అందరితో కలిసి అరటి ఆకులో భోజనం చేశారు. వంటకాలు చాలా బాగున్నాయని తమిళంలో చెప్పుకొచ్చారు రాహుల్.
యూట్యూబ్లో ఈ వీడియో 31.24 లక్షల వ్యూస్ సంపాదించింది. కరూర్ ఎంపీ ఎస్ జోతిమణి, పార్టీ తమిళనాడు ఇంఛార్జీ దినేష్ గుండు రావ్ సైతం రాహుల్తో పాటే ఉన్నారు.
ఇదీ చదవండి: 'తమిళ సంస్కృతి పట్ల మోదీకి గౌరవం లేదు'