ఉత్తరప్రదేశ్లోని ఓ సైకో.. సొంత అన్ననే చంపడానికి ప్రయత్నించాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అప్పటికే ఇద్దరిని చంపినట్టు, మరో ముగ్గురిని హత్యచేయడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పాడు ఆ ఉన్మాది. ఇలా హత్యలు చేయడమంటే తనకు ఎంతో ఇష్టమని ఆ సైకో చెప్పడం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది.
'చంపడమంటే ఇష్టం...'
ఎటా జిల్లాలోని ధర్మపుర్ గ్రామవాసి రాధేశ్యామ్. ఇంటర్ పూర్తి చేసుకున్న అతను ఇదివరకే తన బంధువుల పిల్లలైన ఆరేళ్ల సత్యేంద్ర, ఐదేళ్ల ప్రశాంత్ను హతమార్చాడు.
జూన్ 11వ తేదీన సొంత అన్ననే హత్యచేయడానికి సిద్ధపడ్డాడు శ్యామ్. అన్న విశ్వనాథ్ సింగ్ నిద్రిస్తున్న సమయంలో గొడ్డలితో చంపాలని తన గదిలోకి వెళ్లాడు. అదే సమయానికి కుటుంబసభ్యులు రాధేశ్యామ్ను పట్టుకున్నారు. విశ్వనాథ్ త్రుటిలో ప్రాణాలు కాపాడుకున్నాడు. చివరికి శ్యామ్ను పోలీసులకు అప్పగించారు.
విచారణలో భాగంగా.. మనుషులను చంపడమంటే తనకు ఎంతో ఇష్టమని రాధేశ్యామ్ చెప్పడం వల్ల పోలీసులు నివ్వెరపోయారు.
"ఇద్దరు బంధువుల పిల్లల్ని చంపినట్టు నిందితుడు అంగీకరించాడు. మరో ముగ్గురిని చంపడానికి కూడా ప్రణాళికలు రచించినట్టు వెల్లడించాడు. మనుషులను చంపి ఆనందించే సైకో ఈ రాధేశ్యామ్."
-- సునీల్ కుమార్, ఎటా ఎస్పీ.
శనివారం ఆ ఉన్మాదిని మెజిస్ట్రేట్ వద్ద హాజరుపరిచారు పోలీసులు. అనంతరం జైలుకు తరలించారు.
అయితే సత్యేంద్ర హత్య కేసులో ఇదివరకు ముగ్గురిని జైలుకు తరలించారు పోలీసులు. వీరిలో ఓ మహిళ కూడా ఉంది. ప్రశాంత్ హత్య కేసులో మరో ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. తాజాగా రాధేశ్యామ్ నేరాన్ని అంగీకరించడం వల్ల వారిపై ఉన్న ఎఫ్ఐఆర్ను రద్దు చేయనున్నారు. త్వరలోనే వారిని విడుదల చేయనున్నారు.