కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం విధించిన లాక్డౌన్ వలస కూలీలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జీవనోపాధి కోల్పోయి దిక్కుతోచని స్థితికి దిగజార్చుతోంది. కర్ణాటక మంగళూరుకు చెందిన వలస కార్మికులూ ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు. స్వగ్రమానికి చేరేందుకు నిండు గర్భిణిని వెంటబెట్టుకుని దాదాపు 142కి.మీ కాలినడకన ప్రయాణించారు.
బిజాపుర్ జిల్లాకు చెందిన ఎనిమిది మంది కార్మికులు కేరళ కన్నూరులో భవన నిర్మాణ పని దొరికిందని ఆనందంగా వెళ్లారు. కానీ, అంతలోనే ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. పనిలోకి రమ్మన్న కాంట్రాక్టరే.. ఇక్కడ పని లేదు వెళ్లిపొమ్మన్నాడు. గత్యంతరం లేక, ఊరెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. కానీ, రవాణా సౌకర్యం లేదు, తప్పని పరిస్థితుల్లో నడక మొదలెట్టారు. వారిలో ఓ నిండు చూలాలు కూడా ఉంది.
![pregnant women are walked with their seven companions for 142 km. from kerala kannur to karnataka mangalore](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-mng-06-142km-walking-script-ka10015_08042020222650_0804f_1586365010_298.jpg)
దారిలో కొందరు దయతలచి ఇచ్చిన ఆహారంతో గర్భిణి ఆకలి తీరుస్తూ.. నాలుగు రోజుల పాటు నడిచి మంగళూరు చేరుకున్నారు. కార్మికుల రక్షణ పట్టించుకోకుండా, అర్థంతరంగా వారిని గ్రామాలకు వెళ్లిపొమ్మన్న కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. అయితే కేరళ నుంచి వచ్చిన ఆ ఎనిమిది మంది కరోనా పరీక్షలు చేయించుకోలేదని మరికొందరు భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే వారికి పరీక్షలు నిర్వహించాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి:పోలీసు విచారణకు తబ్లీగీ జమాత్ అధినేత