కర్తార్పుర్ నడవా ప్రారంభోత్సవానికి హాజరయ్యేందుకు అనుమతి కోరుతూ మాజీ క్రికెటర్, పంజాబ్ ఎమ్మెల్యే నవజోత్ సింగ్ పదేపదే చేసిన విజ్ఞప్తిపై విదేశాంగమంత్రిత్వశాఖ స్పందించింది. కర్తార్పుర్ నడవా ప్రారంభోత్సవం 'చరిత్రాత్మక' సంఘటన అని పేర్కొంది. వ్యక్తిగతంగా ఈ వేడుకకు ఎవరైనా హాజరుకావచ్చని, దీనిపై ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది.
సాధారణ పౌరునిలా..
పాకిస్థాన్కు తాను వెళ్లడంపై ఏదైనా అభ్యంతరం ఉంటే, అదేంటో స్పష్టం చేయాలని కోరుతూ నవజోత్ సింగ్ సిద్ధూ విదేశాంగమంత్రిత్వశాఖకు మూడు లేఖలు రాశారు. మూడో లేఖకూ స్పందించకపోతే.. ఇతర యాత్రికుల మాదిరిగా తానూ పాకిస్థాన్లోని పవిత్ర గురుద్వారాను సందర్శిస్తానని సిద్ధూ స్పష్టం చేశారు.
20 ఏళ్లుగా ఎదురుచూశాం..
సిద్ధూ లేఖలపై విదేశాంగమంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ స్పందించారు. కర్తార్పుర్ నడవా సాకారానికి 20 ఏళ్లుగా భారత్ చేసిన ప్రయత్నం ఇప్పుడు ఫలవంతం అయ్యిందని ఆయన పేర్కొన్నారు.
"నవంబర్ 9న జరిగే కర్తార్పుర్ నడవా ప్రారంభోత్సవం చరిత్రాత్మకం అందువల్ల ఓ వ్యక్తిని ప్రత్యేకంగా చూడడం జరగదు. ఎవరైనా వ్యక్తిగతంగా ఈ వేడుకకు హాజరవ్వచ్చు. ఇందులో ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదు."- రవీశ్కుమార్, భారత విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి
సిద్ధూకు పాక్ వీసా
కర్తార్పుర్ నడవా ప్రారంభోత్సవానికి హాజరవ్వాలని నవజోత్ సింగ్ సిద్ధూను పాకిస్థాన్ ప్రభుత్వం ఆహ్వానించింది. దీనికి సిద్ధూ కూడా అంగీకరించారని తెలిపింది. తాజాగా ఆయనకు వీసాను కూడా మంజూరుచేసింది.
ఇదీ చూడండి: ఈ నెల 13,14న జరిగే బ్రిక్స్ సదస్సుకు మోదీ