ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న కారణంగా ఇతర దేశాల్లో ఉన్న భారతీయులను స్వదేశానికి రప్పిస్తోంది భారత్. ఈ నేపథ్యంలో ఇరాన్లో ఉన్న 234 మంది భారతీయులను రెండు ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి తీసుకొచ్చింది. వీరిని రాజస్థాన్లోని జైసల్మేర్ వద్ద సైన్యం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక శిబిరానికి తరలించినట్లు వెల్లడించారు అధికారులు. వీరిలో 131 మంది విద్యార్ధులు, 103 మంది ఆధ్యాత్మిక పర్యటకులు ఉన్నారు. వీరిని 14 రోజుల పాటు వైద్య పరిశీలనలో ఉంచనున్నారు.
అన్ని సదుపాయాలతో ప్రత్యేక శిబిరం..
జైసల్మేర్ నిర్బంధ కేంద్రాన్ని పూర్తి వైద్య సదుపాయాలతో సిద్ధం చేసినట్లు తెలిపారు అధికారులు. నిర్బంధ కేంద్రంలో ఉన్నవారి కాలక్షేపం కోసం చదరంగం, క్యారమ్స్ వంటి ఆటవస్తువులను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు.
ఇటలీ నుంచి 218 మంది...
ఇటలీ నుంచి 218 మంది భారతీయులు ఈ రోజు ఉదయం దిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. వీరిని వైద్య పరీక్షల నిమిత్తం దిల్లీలోని ఐటీబీపీ ప్రత్యేక శిబిరానికి తరలించినట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి:భారత్లో 107కు చేరుకున్న కరోనా కేసులు