కరోనా వైరస్ ఒకరికి సోకితే ఆ వ్యక్తి నుంచి సగటున మరో ముగ్గురికి (ఇంకా చెప్పాలంటే 2.2 నుంచి 3.1 మందికి) వ్యాపించే అవకాశం ఉంటుందని.. అందుకే ఈ మహమ్మారి వ్యాప్తిని, సంక్రమణ వేగాన్ని తగ్గించాలంటే దూరాన్ని పాటించడం తప్పనిసరి అని కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. రోగులను ఆసుపత్రుల్లో చేర్చడం, అనుమానితులను వేరుగా ఉంచడం (ఐసోలేషన్), లాక్డౌన్, క్వారెంటైన్ వంటి చర్యల ద్వారానే దీన్ని అరికట్టడం సాధ్యమవుతుందని పేర్కొంది. కరోనా వ్యాప్తిని నివారించే దిశగా వివిధ కీలక అంశాలపై అవగాహన కల్పిస్తూ సూచనలు చేసింది.
80 శాతం తేలికపాటి కేసులే..
దాదాపు 80% కరోనా కేసులు తేలికపాటిగానే (మైల్డ్) ఉంటున్నాయి. మిగిలిన కేసులను మాత్రమే ఆసుపత్రిలో చేర్చాల్సి వస్తోంది. వాటిలోనూ 5% మందికే అత్యవసర సేవలు అవసరం అవుతాయి. ఇది సోకిన వారిలో ఎక్కువ మందికి కనీసం ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం కూడా రాదు. వైద్య ఆరోగ్య సిబ్బందికి సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున వారంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలి. సామాన్య ప్రజానీకంలో 60 ఏళ్లకు పైబడిన వారు, హృద్రోగులు, అధిక రక్తపోటు, మధుమేహం, ఉబ్బసం సమస్యలు ఉన్న వారికి ముప్పు ఎక్కువ.
పత్రికలు సురక్షితం
వైరస్ల సంఖ్య (వైరల్ లోడ్) 10,000 పీఎఫ్యూ (ప్లేక్ ఫార్మింగ్ యూనిట్స్) ఉన్నప్పుడు ఈ వైరస్ వార్తాపత్రికలపై గానీ, నూలుదుస్తులపై గానీ 5 నిమిషాల్లోనే అంతరించి పోతుంది. అందువల్ల పత్రికల ద్వారా కరోనా సోకదు.
పాలప్యాకెట్లను కడిగితే చాలు..
- పాలప్యాకెట్లను వినియోగించే ముందు వాటిని కడిగితే సరిపోతుంది.
పెంపుడు జంతువులతో ఇబ్బందేమీ లేదు
- ఇళ్లలోని పెంపుడు జంతువులపైనగానీ పశుసంపదపైన గానీ కరోనా వైరస్ ప్రభావం ఉండదు. అందువల్ల గుడ్లు, పౌల్ట్రీ ఉత్పత్తులు తినడం వల్ల ఏమీ కాదు.
బాల్కనీల్లో కూర్చోవచ్చు..
- కరోనా వైరస్ గాలిలో 2.7 గంటల వరకే మనగలుగుతుంది. అందువల్ల బాల్కనీ, టెర్రస్ లాంటి చోట్ల కూర్చోవడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. ఎండలు, ఉక్కపోత పెరగడం.. వర్షాల వల్ల ఈ వైరస్ వ్యాప్తి తగ్గుతుందని చెప్పడానికి ఇంతవరకు బలమైన ఆధారాలు ఏమీ లేవు.
ఇదీ చదవండి: దేశంలో 10 కరోనా హాట్స్పాట్లను గుర్తించిన కేంద్రం