కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో సామూహిక ఉత్సవాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు నేతలు. ఈ క్రమంలో హోలీ వేడుకల్లో తాము పాల్గొనటం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా భాజపా అగ్రనేతలు ప్రకటించారు. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా హోలీ వేడుకలు చేసుకోనని స్పష్టం చేశారు. అందుకు కరోనాతో పాటు దిల్లీ అల్లర్లు చేలరేగటాన్ని కారణంగా పేర్కొన్నారు ఆప్ అధినేత.
రాష్ట్రపతి భవన్..
కోవిడ్-19 కలవరపెడుతున్న నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ ఏడాది హోలీ వేడుకలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దూరంగా ఉండనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి భవన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
ప్రధాని మోదీ..
కరోనా వైరస్పై ప్రజలు ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు ప్రధాని మోదీ. హోలీ వేడుకలకు తాను దూరంగా ఉంటున్నట్లు ట్విట్టర్ వేదికగా తెలిపారు.
"కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి సామూహిక సమావేశాలు తగ్గించాలని ప్రపంచ దేశాలకు వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేను ఈ సారి హోలీ వేడుకల్లో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నా."
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా మోదీ బాటలోనే నడుస్తూ.. హోలీకి దూరంగా ఉండనున్నట్టు ప్రకటించారు.
భాజపా రాష్ట్రాల అధినేతలకు లేఖ..
తమ పార్టీ ఎమ్మెల్యేలు హోలీలో పాల్గొనరని దిల్లీ భాజపా ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రధాని మోదీ, అమిత్ షా, నడ్డాల నిర్ణయాన్ని తామూ గౌరవిస్తున్నట్లు పేర్కొంది. అన్ని రాష్ట్రాల్లో పార్టీ నేతలు హోలీ వేడుకలకు దూరంగా ఉండాలని పార్టీ అధ్యక్షులకు నడ్డా లేఖ రాసినట్లు సమాచారం.
దిల్లీ అల్లర్ల నేపథ్యంలో..
కరోనా వ్యాప్తి సహా దిల్లీలో పౌర అల్లర్లు చెలరేగిన సందర్భాన్ని పేర్కొంటూ.. ముఖ్యమంత్రి కేజ్రీవాల్, భాజపా దిల్లీ అధ్యక్షుడు మనోజ్ తివారీ ఈ ఏడు హోలీ వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. దిల్లీ అల్లర్లలో పలువురు ప్రాణాలు కోల్పోయారని, వారి కుటుంబ సభ్యులు బాధలో ఉంటే తాము ఉత్సవాలు ఏలా చేసుకుంటామని ఈ సందర్భంగా పేర్కొన్నారు కేజ్రీ. దిల్లీ మంత్రులు, ఎమ్మెల్యేలు హోలీకి దూరంగా ఉంటారని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: జమ్ముకశ్మీర్లో ఉగ్రదాడి-ఎస్పీఓ సహా ఇద్దరు మృతి