పాత బైక్ అంటూ ఉంటే సెకండ్ హ్యాండ్లో అమ్మడం, కొనడం చూస్తుంటాం. కాస్త వినూత్నంగా ఆలోచించిన ఓ యువ ఇంజినీర్ దాని ఇంజిన్ను మరో రకంగా ఉపయోగించి బహుళ ప్రయోజన యంత్రంగా మార్చాడు. లాక్డౌన్లో వచ్చిన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈ అద్భుత ఆవిష్కరణకు శ్రీకారం చుట్టాడు ఓ కర్ణాటక వాసి.
6 మంది - ఒకేసారి..
వృత్తిరీత్యా ఇంజినీర్ అయిన నందన్.. వ్యవసాయంలో క్రిమి సంహారక మందులను పిచికారీ చేయడం సహా.. వాహనాలను శుభ్రం చేసుకొనేందుకు వీలుగా యంత్ర పరికరాన్ని రూపొందించాడు. ఫలితంగా చుట్టుపక్కల గ్రామాల్లో అతడి పేరిప్పుడు మార్మోగుతోంది. ఈ యంత్ర పరికరాన్ని ఉపయోగించి ఆరుగురు వ్యక్తులు ఒకేసారి పనిచేసుకోవచ్చు. అంతేకాకుండా ఒక లీటర్ పెట్రోల్తో 600 అరెకా(పోక) చెట్లకు పిచికారీ చేయవచ్చని నందన్ పేర్కొన్నాడు.
'చిన్ననాటి నుంచే ఆవిష్కణలంటే నాకు అమితాసక్తి. 5వ తరగతి నుంచే ప్రయోగాలు చేయడం ప్రారంభించా. కానీ ఇంజినీరింగ్ చదువుతున్న కొద్దికాలం ప్రయోగాలను ఆపేశాను. అయితే లాక్డౌన్ కారణంగా మళ్లీ నా ఆవిష్కరణలకు పదునుపెట్టాను.'
- నందన్ గౌడ
ప్రభుత్వం తోడ్పాటునందిస్తే..
అయితే వ్యవసాయం కోసం మరిన్ని ఆవిష్కరణలపై దృష్టి చేశానని చెప్పాడు నందన్. పాఠశాల విద్యార్థులకూ ఇలాంటి నమూనాలను తయారు చేసి ఇచ్చానన్నాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాయమందిస్తే.. మరిన్ని మెషీన్లను తయారుచేస్తానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.
ఇదీ చదవండి: 'జీవితాలను సరిదిద్దుకొనే సమయమిదే'