లాక్డౌన్ నిబంధనల విషయంలో కొందరు పోలీసుల అవగాహన లోపం... ఓ కుటుంబాన్ని తీవ్ర అవస్థలకు గురిచేసింది. అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిని... కుమారుడు మోసుకెళ్లాల్సిన దుస్థితికి కారణమైంది. ఈ వ్యవహారంపై కేరళ మానవ హక్కుల సంఘం సుమోటోగా కేసు నమోదు చేసింది.
ఏం జరిగింది?
కేరళ కొల్లాం జిల్లా కులతుపుజాకు చెందిన 85ఏళ్ల వ్యక్తి కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఇటీవల పునాలుర్ తాలూకా ఆసుపత్రిలో చేరి.. ఆరోగ్యం కుదుటపడటం వల్ల బుధవారం డిశ్చార్జ్ అయ్యాడు. అతని కుమారుడు రాయ్మన్తో కలిసి ఆటోరిక్షాలో ఇంటికి వెళ్తుండగా పోలీసులు టీబీ జంక్షన్ వద్ద నిలిపేశారు. లాక్డౌన్ వేళ వాహనాలు తిరిగేందుకు అనుమతి లేదని తెగేసి చెప్పారు. తన తండ్రి పరిస్థితిని రాయమ్న్ వివరించినా పట్టించుకోలేదు.
వెంటనే రాయ్మన్ ఆసుపత్రికి నడుచుకుంటూ వెళ్లి సూపరింటెండెంట్ ఇచ్చిన లేఖ తీసుకొచ్చాడు. అయినప్పటికీ పోలీసులు అనుమతించకపోగా.. నడుచుకుంటూ వెళ్లాలని ఆదేశించారు. వారికి భయపడి ఇతర వాహనాలూ సాయమందించేందుకు నిరాకరించాయి. ఇక వేరే గత్యంతరం లేక రాయ్మన్ తన తండ్రిని మోసుకొంటూ, తల్లితో కలిసి ఇంటికి తీసుకెళ్లాడు.
"ఆటోలో తండ్రిని తీసుకెళ్లేందుకు వీలుగా పాస్ ఇవ్వాలని ముందే కులతుపుజా పోలీస్ స్టేషన్కు వెళ్లి అడిగాను. కానీ.. అప్పుడు పోలీసులు అవసరం లేదన్నారు. స్వీయ అఫిడవిట్ చూపిస్తే చాలని చెప్పారు. ఇప్పుడేమే ఇలా ఇబ్బందులకు గురిచేశారు" అని ఆవేదన వ్యక్తంచేశాడు రాయ్మన్.