కరోనా వ్యాప్తితో దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించింది ప్రభుత్వం. లాక్డౌన్తో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కొంత మంది ఇంట్లో ఖాళీగా గడుపుతుంటే.. మరికొందరు మాత్రం దొరికిన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. కర్ణాటక ధార్వాడ్ నగరంలోని నాలుగు ప్రాంతాల ప్రజలు కూడా చెరువు రూపంలో లాక్డౌన్ను సద్వినియోగం చేసుకున్నారు. అదెలాగో చూద్దాం..
ధార్వాడ్ నగరంలోని బసవేశ్వర బదావనే, శాకంబరి, గురుదేవ, నందిని లేఅవుట్లో నివాసముంటున్న ప్రజలు తమ ప్రాంతంలో ఉన్న 1.5 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఒక సరస్సును నిర్మించాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా అందరూ కలిసి 3 లక్షల రూపాయలను సిద్ధం చేసి సరస్సును తవ్వేశారు.
అధికారులు స్పందించని కారణంగా
ఈ సరస్సును తవ్వించాలని ప్రభుత్వాధికారులను ఎన్ని సార్లు విన్నవించినా ఫలితం లేనందున.. చివరకు తమ సొంత ఖర్చుతోనే తవ్వేశారు ధార్వాడ్ ప్రజలు.
స్థలంపై వివాదం...
కొంత మంది వ్యాపారవేత్తలు చెరువును తవ్విన స్థలంలో తమ వ్యాపార కార్యక్రమాల కోసం ఓ భవనాన్ని నిర్మించేందుకు ప్రయత్నాలు చేశారు. దీన్ని ఆ ప్రాంత ప్రజలు వ్యతిరేకించారు. 2002 నుంచి ఈ స్థలంపై పోరాటం చేస్తున్నట్లు తెలిపారు.
చివరకు ఈ స్థలాన్ని వ్యాపార వేత్తల వశం కాకుండా చెరువును సృష్టించగలిగారు. ప్రస్తుతం రాష్ట్రంలో రుతుపవనాలు ప్రవేశించడం వల్ల వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఫలితంగా ఈ సరస్సు కూడా వాన నీటితో నిండుతోంది. తాము తవ్విన సరస్సులో నీటిని చూసిన ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.