ఉత్తరాఖండ్లోని పవిత్ర కేదార్నాథ్ మందిరాన్ని శీతాకాలం రాక దృష్ట్యా ఈరోజు ఉదయం మూసివేశారు. సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ కార్యక్రమానికి సుమారు 12 వందల మంది భక్తులు హాజరైనట్లు ఆలయ కమిటీ అధికారులు తెలిపారు.
కేదార్నాథ్ దేవాలయంలోని పంచముఖ మహాశివుని విగ్రహాన్ని పూలపల్లకిలో ఊరేగిస్తూ ఉఖిమఠ్లోని ఓంకారేశ్వర దేవాలయానికి తీసుకెళ్తున్నారు. జమ్ముకశ్మీర్ పదాతిదళ బృందం సంగీత వాయిద్యాల నడుమ ఈ యాత్ర సాగుతోంది. ఈ ఊరేగింపు రాంపుర్, గుప్త్కాశీ మీదుగా అక్టోబర్ 31న ఓంకారేశ్వర ఆలయానికి చేరుకుంటుంది. వచ్చే ఆరు నెలలు కేదారనాథుడు ఇక్కడే పూజలందుకుంటాడు.
ఈ సీజన్లో మొత్తంగా 9,97,585 మంది భక్తులు కేదార్నాథ్ మందిరాన్ని సందర్శించారని ఆలయ కమిటీ ప్రతినిధి తెలిపారు.
యమునోత్రి
ఈరోజు మధ్యాహ్నం 12.15 గంటలకు అభిజీత్ ముహూర్తానికి యమునోత్రి ధామ్ తలుపులనూ మూసివేశారు. ఆ తరువాత సంప్రదాయ సంగీత వాయిద్యాలతో శనిదేవ్ డోలీలో విగ్రహమూర్తిని ఊరేగిస్తూ యమునోత్రి నుంచి ఖుషమత్కు బయలుదేరారు.
ఇదీ చూడండి: కశ్మీర్లో ఈయూ ప్రతినిధుల బృందం పర్యటన