కాంగ్రెస్ పార్టీని ప్రక్షాలన చేయాలంటూ లేఖ రాసిన అసంతృప్త వాదులకు సోనియా గాంధీ చెక్ పెట్టారు. ఉభయ సభల్లో వారి ప్రాధాన్యాన్ని తగ్గిస్తూ రెండు వేర్వేరు సమన్వయ కమిటీలు ఏర్పాటు చేశారు. రాజ్యసభలో కాంగ్రెస్ చీఫ్ విప్గా సీనియర్ నాయకుడు జైరాం రమేష్ను నియమించారు.
పార్టీ సమన్వయం కోసం..
పార్టీ సమన్వయం కోసం ఆయనతో పాటు తన రాజకీయ సలహాదారైన అహ్మద్పటేల్, సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్లతో కమిటీ ఏర్పాటు చేశారు. అందులోనే రాజ్యసభ ప్రధాన ప్రతిపక్షనేత గులాంనబీ ఆజాద్, ఉప నాయకుడు ఆనంద్శర్మలను సభ్యులుగా చేర్చారు. దీంతో ఇప్పటివరకు ఉన్న వీరి ప్రాధాన్యాన్ని తగ్గించినట్టయింది.
యువనేతలకు ఛాన్స్..
అలాగే లోక్సభలో సీనియర్ నేతలైన మనీష్ తివారీ, శశిథరూర్ ప్రాధాన్యాన్ని తగ్గిస్తూ అక్కడ ఉపనేత బాధ్యతలను అసోం యువనేత గౌరవ్ గొగొయ్కి అప్పగించారు. విప్గా పంజాబ్లోని లుథియానా లోక్సభ సభ్యుడు రవ్నీత్సింగ్ బిట్టును నియమించారు. గౌరవ్గొగొయ్ మాజీ ముఖ్యమంత్రి తరుణ్గొగొయ్ కుమారుడు కాగా, రవ్నీత్సింగ్ బిట్టు పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి సర్దార్బియాంత్సింగ్ మనుమడు. ఈ యువనేతలిద్దరూ యూత్ కాంగ్రెస్ నుంచి రాజకీయంగా ఎదిగారు. లోక్సభలో కాంగ్రెస్ సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి, చీఫ్ విప్ కె.సురేశ్, విప్ మాణికిమ్ ఠాగూర్లతో కలిసి వీరిద్దరూ సభా సమన్వయ బాధ్యతలను చూసుకుంటారు.
ఇదీ చదవండి: 'కాంగ్రెస్ పతనానికి అవే కారణాలు'