దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతున్నందున భారత సైన్యం అప్రమత్తమైంది. తమ అధీనంలో మరిన్ని నిర్భంద కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు సైనికాధికారులు వెల్లడించారు. ప్రస్తుతమున్న వాటితో పోలిస్తే.. అదనంగా మరో 1,500 మందికిపైగా వైద్యం సదుపాయం అందించేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు స్పష్టం చేశారు.
అయితే.. ఈ నిర్బంధ కేంద్రాలను జైసల్మేర్, సూరత్ఘడ్, సికింద్రాబాద్, చెన్నై, కోల్కతా ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి. మిలిటరీ ఆస్పత్రుల్లోనూ ప్రత్యేక వార్డుల ఏర్పాటు, స్క్రీనింగ్ చేసేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయనున్నారు. స్థానిక వైద్య నిపుణుల సహకారంతో ఆర్మీ ఆస్పత్రుల వైద్యులు పని చేయనున్నారు.
జనవరిలో.. హరియాణాలోని మనేసర్లో ఓ నిర్బంధ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది సైన్యం. కరోనా అనుమానితులకు వైద్యం అందిస్తోంది.
పలు మార్గదర్శకాలు
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది సైన్యం. అత్యవసరమైతే తప్ప విదేశీ పర్యటనలు చేయొద్దని సూచించింది. వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు అత్యవసరంగా స్పందించాల్సిన అంశాలపైనా సూచనలు చేసింది. పరిస్థితులు మెరుగయ్యే వరకు ప్రజలు పెద్ద సంఖ్యలో పోగయ్యే ఉత్సవాలు, సంక్షేమ కార్యక్రమాలు వంటివి చేపట్టకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. మిలిటరీ స్టేషన్ల పరిధిలోని దుకాణ సముదాయాలను వినియోగించుకునేందుకు అవకాశం కల్పించింది.
భారత్లో 31 కేసులు
ఇప్పటివరకు 90కి పైగా దేశాలకు విస్తరించింది కరోనా. భారత్లో వైరస్ నిర్ధరణ అయిన కేసుల సంఖ్య 31కి చేరింది. మరో 29వేల మంది వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
ఇదీ చదవండి: ఆఫీసులు, స్కూళ్లు, యూనివర్సిటీల్లో ఇక అవి బంద్!