బంగాల్కు చెందిన విప్లవకారుడు కుదిరాం బోస్ యావత్ భారతావనికి గర్వకారణమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కొనియాడారు. ప్రాంతీయవాదంతో రాజకీయాలు చేస్తున్న వారిని ఉద్దేశిస్తూ.. ఈ వ్యాఖ్యలు చేశారు షా. పశ్చిమ్ బంగాలో రెండు రోజుల పర్యటనలో ఉన్న షా.. కుదిరామ్ బోస్ నివాసాన్ని సందర్శించి.. ఆయన విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. బోస్ను 1908లో బ్రిటీష్ పాలకులు ఉరితీసిన సమయంలో.. ఆయన 'వందే మాతరం' నినాదంతో దేశ యువతను చైతన్య పరిచారని పేర్కొన్నారు.
వచ్చే ఏడాది జరగనున్న బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో.. భాజపా బయటి వ్యక్తులను పోటీ చేయించాలని భావిస్తున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బంగాల్ ముఖ్యమంత్రి మమత ఇటీవల విమర్శలు చేశారు. మరికొంత మంది టీఎంసీ నేతలు ఇదే వ్యాఖ్యలు చేశారు.
పరోక్షంగా టీఎంసీ నేతల విమర్శలను ఉద్దేశిస్తూ.. 'ప్రాంతీయ వాదంతో రాజకీయాలు చేస్తున్న వారికి చెప్పాలనుకున్నది ఒక్కటే. స్వాతంత్ర్య సమరయోధుడు కుదిరామ్ బోస్ యావత్ దేశానికే గర్వకారణం' అని షా ఎదురుదాడికి దిగారు. ప్రాంతీయ వాదం నుంచి బయటకు రావాలని వ్యాఖ్యానించారు.
ఇదీ చూడండి:సాగు చట్టాలపై ఈ-బుక్లెట్లు చదవాలని మోదీ విజ్ఞప్తి