తమిళనాడు తిరునవేళి జిల్లాలోని ఓ గ్రామ పంచాయతీకి లక్ష రూపాయలు జరిమానా చెల్లించని ఓ రైతు, అతడి సోదరుడిపై దుండగులు మారణాయుధాలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆ సోదరుడు ప్రాణాలు కోల్పోగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రేమకు జరిమానా..
కులం అడ్డు గోడలను కూల్చుతూ.. ప్రేమ పెళ్లికి పెద్ద పీట వేస్తోంది ఈ తరం యువత. కానీ ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో ప్రేమ పెళ్లిళ్లకు వ్యతిరేకంగా వింత కట్టుబాట్లు కొనసాగుతున్నాయి. తిరునవేళి జిల్లా, గౌతనామపురంలో అయితే మరీ క్రూరంగా.. తల్లిదండ్రులు బిడ్డల ప్రేమను అంగీకరించినా గ్రామ పంచాయతీ మాత్రం ఒప్పుకోవడం లేదు. ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఆ కుటుంబం పంచాయతీకి భారీగా జరిమానా కట్టాల్సిందే.
ప్రాణం తీశారు..
అదే గ్రామానికి చెందిన ముధియజాగన్, రవి అన్నాదమ్ములు. రవి కూతురు ఈ మధ్యే ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లాడింది. గ్రామ కట్టుబాటు ప్రకారం రవి పంచాయతీకి రూ.1500 జరిమానా కట్టేశాడు. కానీ, గ్రామ పెద్దలు 'ఆ జరిమానా సరిపోదు.. నీ కూతురు చేసినదానికి లక్ష రూపాయలు చెల్లించాల్సిందే'నన్నారు. అంత డబ్బు తానిచ్చుకోలేనని చెప్పినా పదే పదే రవితో తగాదాకు దిగేవారు గ్రామ పంచాయతీ సభ్యులు.
ఈ క్రమంలోనే రవి, ముధియజగన్లపై గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. రవి తలకు తీవ్ర గాయమైంది. దారుణంగా గాయపడిన ముధియజగన్ను ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు.
ముధియజన్ హత్యకు గ్రామ పెద్దలే కారకులంటూ.. నిరసనకు దిగారు అతడి బంధువులు. దీంతో గ్రామ ప్రెసిడెంట్ సహా 11 మంది అనుమానితులను అరెస్ట్ చేశారు పోలీసులు.
ఇదీ చదవండి: తండ్రి అత్యాశ.. కారుకోసం కొడుక్కి పెళ్లి ఏర్పాట్లు!