ఉత్తరాఖండ్లో అనూహ్య ఘటన ఆసల్యంగా వెలుగులోకి వచ్చింది. సుమారు ఆర్నెల్ల పాటు గదిలో బందీ అయిన ఓ వృద్ధ జంటను గుర్తించారు పోలీసులు. నెలలపాటు నీరు, ఆహారంలేని ఆ దంపతులు బక్కచిక్కిపోయారు. తీవ్ర అనారోగ్యం బారినపడిన వారిని.. చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థతి విషమంగా ఉన్నట్టు సమాచారం.
![Jaman Singh Negi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10455907_1.jpg)
![Devaki Devi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10455907_2.jpg)
అసలేం జరిగిందంటే.?
మాజీ సైనిక ఉద్యోగి జమాన్ సింగ్ నేగి(60), భార్య దేవకీ దేవితో కలిసి బాగేశ్వర్ జిల్లాలో నివాసముంటున్నారు. ఇద్దరూ ఇంట్లో ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి.. గదికి తాళం వేసి వెళ్లారు. చేసేదేమీ లేక.. ఆ వృద్ధులిద్దరూ సుమారు ఆరు నెలల పాటు అందులోనే ఉండిపోయారు.
దిల్లీలో ఉండే వారి కుమారుడు జగత్సింగ్.. తన తల్లిదండ్రులతో మాట్లాడేందుకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫలితం లేకపోయింది. అనుమానం వచ్చిన ఆయన.. పొరుగువారిని సంప్రదించగా అసలు విషయం బయటపడింది. తాళం వేసిన గది దృశ్యాలను వీడియో తీసి.. జగత్కు పంపాడు స్థానికుడు. విషయం తెలియగానే.. వెంటనే బాగేశ్వర్కు చేరుకుని పోలీసులకు సమాచారమిచ్చారు జగత్. పోలీసులు అక్కడికి చేరుకుని తాళం పగులగొట్టి వారిని రక్షించారు. అనంతరం స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ పూర్తి వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: మూడేళ్ల బాలికపై 22 ఏళ్ల యువకుడి అత్యాచారం