కరోనా వైరస్ సంక్రమణకు వ్యతిరేకంగా దిల్లీ జనాభాలో 'హెర్డ్ ఇమ్యూనిటీ' అభివృద్ధి చెందే సూచనలు కనిపిస్తున్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఐదో దశ సెరోలాజికల్ సర్వేలో ఈ విషయం తేలిందని వెల్లడించాయి. ఒక జిల్లాలో 50-60 శాతం శాంపిళ్లలో కొవిడ్ -19కు వ్యతిరేకంగా యాంటీబాడీలను గుర్తించినట్లు వివరించాయి.
గత వారం ముగిసిన ఈ సర్వేలో.. నగరంలోని వివిధ జిల్లాల నుంచి 25 వేల మంది నుంచి శాంపిళ్లు సేకరించినట్లు అధికారులు వెల్లడించారు. 11 జిల్లాల్లో విస్తరించి ఉన్న దిల్లీ జనాభా 2 కోట్ల పైమాటే.
'హెర్డ్ ఇమ్యూనిటీ' అంటే?
ఏదైనా సమూహంలో ఎవరికైనా వైరస్ సోకి కోలుకున్న తర్వాత.. చాలా మంది శరీరంలో ఆ వైరస్కు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందుతుంది. వైరస్కు వ్యతిరేకంగా కావాల్సిన యాంటీబాడీలు అభివృద్ధి చెందడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. అలాంటి రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తులు.. కరోనా వైరస్ సోకిన వారికి, సోకని వారికి మధ్య రక్షణ కవచంలా నిలుస్తారు. దీని ద్వారా కరోనా వైరస్ సంక్రమణ గొలుసు తెగిపోతుంది. దీనినే 'హెర్డ్ ఇమ్యూనిటీ' అంటారు.