కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం దేశంలో విధించిన లాక్డౌన్ నిబంధనలను కొందరు ప్రజలు సరిగ్గా అమలు చేయడం లేదని అసహనం వ్యక్తంచేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. లాక్డౌన్ నిబంధనల ఉల్లంఘనల వల్లే దేశంలో వైరస్ కేసుల్లో పెరిగాయని అభిప్రాయపడింది. నిజాముద్దీన్ ఘటన దేశప్రజలకు కనువిప్పు వంటిదని వ్యాఖ్యానించింది. మర్కజ్ కార్యక్రమంలో పాల్గొన్న వారిని గుర్తించే చర్యలు కొనసాగుతున్నట్లు వివరించింది. దేశవ్యాప్తంగా కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రక్రియ ముమ్మరంగా చేపడుతున్నట్లు తెలిపింది.
దిల్లీ నిజాముద్దీన్లో లాక్డౌన్ కాలం అమలులో ఉన్నప్పటికీ మత కార్యక్రమాలు కొనసాగాయి. ఈ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నవారిలో 10మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురికి వైరస్ సోకింది. ఈ నేపథ్యంలో ఆరోగ్య శాఖ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
వలస కూలీల కోసం 21వేల క్యాంపులు..
దేశంలో నిరాశ్రయుల కోసం 21,000 శిబిరాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది వైద్య ఆరోగ్యశాఖ. ఇందులో 6.6 లక్షలమంది నిరాశ్రయులు, వలసకూలీలు ఆశ్రయం పొందుతున్నట్లు స్పష్టం చేసింది. 23 లక్షల మందికి ఈ క్యాంపుల ద్వారా ఆహారం అందిస్తున్నట్లు వెల్లడించింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో సమన్వయం ద్వారా లాక్డౌన్ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది.
వైద్యులకు నిర్లక్ష్యం వల్ల కాదు..
పలువురు వైద్యులకు కరోనా సోకడంపై స్పందించింది ఆరోగ్య శాఖ. వారికి వైరస్ సోకేందుకు కారణం నిర్లక్ష్యపూరిత వైఖరి కాదని స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: మందు బాబులకు లిక్కర్ పాసులు- ప్రభుత్వం సంచలన నిర్ణయం