ETV Bharat / bharat

కరోనా ఎఫెక్ట్​: రెక్క విప్పుతున్న నిరుద్యోగం

author img

By

Published : Apr 9, 2020, 8:58 AM IST

భూమండలాన్ని గడగడలాడిస్తోన్న కరోనా మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడటమే కాదు.. పలు రంగాల మీద తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఫలితంగా వేలాది మంది ఉపాధి అవకాశాలు కోల్పోనున్నారని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) నివేదించింది. విశ్వవ్యాప్తంగా 125 కోట్లమంది శ్రామికుల జీవనోపాధికి ముప్పు వాటిల్లుతుందని ఐఎల్‌ఓ నివేదించింది. భారత్​లోనూ ఇదే పరిస్థితి దాపరించనుందని హెచ్చరించింది.

Coronavirus: Employment opportunities that will be reduced at an unpredictable level
రెక్క విప్పుతున్న నిరుద్యోగం.. ప్రభుత్వాలు మేలుకుంటేనే!

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌ విజృంభణకు దేశదేశాల్లో ఎన్నో రంగాలు, జీవితాలు నిస్తేజమవుతున్నాయి. అనూహ్య స్థాయిలో ఉపాధి అవకాశాలు తెగ్గోసుకుపోతున్నాయి. దేశీయంగా అసంఘటిత రంగంలోని అసంఖ్యాకుల బతుకు దీపాలే కాదు, ఖరారయ్యాయనుకున్న ఐఐటీల ప్రాంగణ కొలువులూ ఆరిపోతున్నాయి. కరోనా మహా సంక్షోభం మూలాన విశ్వవ్యాప్తంగా 125 కోట్లమంది శ్రామికుల జీవనోపాధికి ముప్పు ఏర్పడినట్లు అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) తాజాగా మదింపువేసింది.

భారత్​లోనూ..

భారత్‌లోని అసంఘటిత రంగంలో 40కోట్లమంది వరకు కార్మికులు దుర్భర పేదరికంలోకి జారిపోయే ప్రమాదం పొంచి ఉందనీ అది హెచ్చరించింది. ఐఎల్‌ఓ అధ్యయనంతోపాటు వెలుగు చూసిన సీఎమ్‌ఐఈ (భారత ఆర్థిక రంగ పర్యవేక్షక కేంద్రం) నివేదికాంశాలు- గత నెల మూడోవారం దరిమిలా దేశంలో నిరుద్యోగిత మూడింతలైందని స్పష్టీకరిస్తున్నాయి. నిజానికిది, దెబ్బమీద దెబ్బ. ఆరు నెలల క్రితమే ఆర్థిక మాంద్యం ముదురుతున్న చిన్నెలు ప్రస్ఫుటమయ్యాయి. స్థిరాస్తి, ఆటొమొబైల్‌ మొదలు ఆతిథ్య, రవాణా, సమాచార ప్రసార, వ్యవసాయ తదితర రంగాల్నీ మాంద్యం అప్పటికే ఆవరించింది. కరోనా రూపేణా మహోత్పాతం విరుచుకుపడ్డాక, ప్రపంచ యుద్ధాలనాటి పరిస్థితులకు మించిన సవాళ్లు ఎదురవుతున్నట్లు ప్రధానమంత్రే అంగీకరించారు. దీటైన పరిష్కారాన్వేషణలో ప్రభుత్వం ఎంత మేరకు కృతకృత్యమైనట్లు?

ఉద్దీపన చర్యలు..

మాంద్యానికి విరుగుడుగా ప్రభుత్వ వ్యయీకరణను భారీగా పెంచడంలో అమెరికా, బ్రిటన్‌, జర్మనీ ప్రభృత దేశాల చొరవను ఆర్థిక నిపుణులెందరో గతంలో ప్రశంసించారు. కరోనా రూపేణా సంక్షోభ తీవ్రతను పసిగట్టగానే ఉద్దీపన ప్యాకేజీల్లోనూ ఉట్టిపడింది అదే ముందుచూపు! సుమారు 370 బిలియన్‌ యూరోల(దాదాపు 30 లక్షల కోట్ల రూపాయలు)ను ప్రత్యేకించిన బ్రిటన్‌- వ్యాపార సంస్థలకు ఏడాదిపాటు వడ్డీలేని రుణాలు అందిస్తోంది. కిరాయి ఇళ్లలో నివసించేవారికి ఆర్థిక తోడ్పాటు సమకూరుస్తోంది. వివిధ సంస్థల సిబ్బంది వేతనాల్లో 80శాతం మేర అక్కడి ప్రభుత్వమే భరిస్తోంది. తన వంతుగా అమెరికా రెండు లక్షల కోట్ల డాలర్ల భూరి ప్యాకేజీలో భాగంగా లక్షలాది శ్రామికులకు సాయపడుతోంది.

ఎన్నడూ లేని విధంగా..

ఆస్ట్రేలియాలో నిరుద్యోగ భృతిని రెట్టింపు చేశారు. జర్మనీ, ఫ్రాన్స్‌, సింగపూర్‌, యూఏఈ వంటివి చిన్న తరహా సంస్థలకు కొండంత అండగా నిలిచి ఔదార్యం చాటుకుంటున్నాయి. స్వతంత్ర భారత చరిత్రలో ఇంతటి ఆర్థిక సంక్షోభం ఎన్నడూ చోటుచేసుకోలేదని అమాత్యులెందరు చెబుతున్నా- వ్యవస్థాగతంగా గట్టి దన్ను ఇప్పటికీ అందని మానిపండునే తలపిస్తోంది!

ప్రభుత్వాలదే బాధ్యత

వాణిజ్య కార్యకలాపాలు సన్నగిల్లిన కారణంగా ఉద్యోగులెవర్నీ తొలగించవద్దని, జీతాలకు కోతపెట్టవద్దని సంస్థల యాజమాన్యాలకు ఈపీఎఫ్‌ఓ (ఉద్యోగుల భవిష్యనిధి) ఇటీవల పిలుపిచ్చింది. యథార్థానికి జరగాల్సిందేమిటో భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) వివరణాత్మకంగా సూచించింది. వందమందిలోపు ఉద్యోగులున్న సంస్థల్లో పీఎఫ్‌ వాటాను కేంద్రమే చెల్లించాలని, ఈఎస్‌ఐ పరిధిలో ఉన్నవారికి కేంద్రమే వేతనం ఇవ్వాలని, జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ కలిగిన సంస్థల ఉద్యోగుల జీతాల్నీ చెల్లించాలన్నది సీఐఐ హితవాక్యం. ఆవిరైపోయిన ఉపాధి అవకాశాల స్థానే కొత్తవాటి సృష్టి, జీవిక కోల్పోయినవారికి కొన్నాళ్లపాటు ఆర్థిక తోడ్పాటు- ప్రభుత్వాల జంట లక్ష్యాలు కావాలి. తయారీ రంగంలో 45 శాతం, ఎగుమతుల్లో 40శాతం వాటా కలిగిన సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమ(ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ)లెన్నో ఆపన్న హస్తం కోసం నిరీక్షిస్తున్నాయి. వాటిలో 70శాతానికి పైగా మార్చి నెల జీతాలు ఇవ్వలేకపోయాయి. నిరుద్యోగ రక్కసి రెచ్చిపోకుండా- ఉద్యోగుల్ని, పరిశ్రమల్ని ఆదుకునేలా ప్రభుత్వ ఉదార సంక్షేమ చర్యలు... సూక్ష్మ సంస్థలతోనే మొదలు కావాలి!

ఇదీ చూడండి: 'కరోనా వ్యాప్తికి వర్గాన్ని, ప్రాంతాన్ని కారణంగా చూడకండి'

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌ విజృంభణకు దేశదేశాల్లో ఎన్నో రంగాలు, జీవితాలు నిస్తేజమవుతున్నాయి. అనూహ్య స్థాయిలో ఉపాధి అవకాశాలు తెగ్గోసుకుపోతున్నాయి. దేశీయంగా అసంఘటిత రంగంలోని అసంఖ్యాకుల బతుకు దీపాలే కాదు, ఖరారయ్యాయనుకున్న ఐఐటీల ప్రాంగణ కొలువులూ ఆరిపోతున్నాయి. కరోనా మహా సంక్షోభం మూలాన విశ్వవ్యాప్తంగా 125 కోట్లమంది శ్రామికుల జీవనోపాధికి ముప్పు ఏర్పడినట్లు అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) తాజాగా మదింపువేసింది.

భారత్​లోనూ..

భారత్‌లోని అసంఘటిత రంగంలో 40కోట్లమంది వరకు కార్మికులు దుర్భర పేదరికంలోకి జారిపోయే ప్రమాదం పొంచి ఉందనీ అది హెచ్చరించింది. ఐఎల్‌ఓ అధ్యయనంతోపాటు వెలుగు చూసిన సీఎమ్‌ఐఈ (భారత ఆర్థిక రంగ పర్యవేక్షక కేంద్రం) నివేదికాంశాలు- గత నెల మూడోవారం దరిమిలా దేశంలో నిరుద్యోగిత మూడింతలైందని స్పష్టీకరిస్తున్నాయి. నిజానికిది, దెబ్బమీద దెబ్బ. ఆరు నెలల క్రితమే ఆర్థిక మాంద్యం ముదురుతున్న చిన్నెలు ప్రస్ఫుటమయ్యాయి. స్థిరాస్తి, ఆటొమొబైల్‌ మొదలు ఆతిథ్య, రవాణా, సమాచార ప్రసార, వ్యవసాయ తదితర రంగాల్నీ మాంద్యం అప్పటికే ఆవరించింది. కరోనా రూపేణా మహోత్పాతం విరుచుకుపడ్డాక, ప్రపంచ యుద్ధాలనాటి పరిస్థితులకు మించిన సవాళ్లు ఎదురవుతున్నట్లు ప్రధానమంత్రే అంగీకరించారు. దీటైన పరిష్కారాన్వేషణలో ప్రభుత్వం ఎంత మేరకు కృతకృత్యమైనట్లు?

ఉద్దీపన చర్యలు..

మాంద్యానికి విరుగుడుగా ప్రభుత్వ వ్యయీకరణను భారీగా పెంచడంలో అమెరికా, బ్రిటన్‌, జర్మనీ ప్రభృత దేశాల చొరవను ఆర్థిక నిపుణులెందరో గతంలో ప్రశంసించారు. కరోనా రూపేణా సంక్షోభ తీవ్రతను పసిగట్టగానే ఉద్దీపన ప్యాకేజీల్లోనూ ఉట్టిపడింది అదే ముందుచూపు! సుమారు 370 బిలియన్‌ యూరోల(దాదాపు 30 లక్షల కోట్ల రూపాయలు)ను ప్రత్యేకించిన బ్రిటన్‌- వ్యాపార సంస్థలకు ఏడాదిపాటు వడ్డీలేని రుణాలు అందిస్తోంది. కిరాయి ఇళ్లలో నివసించేవారికి ఆర్థిక తోడ్పాటు సమకూరుస్తోంది. వివిధ సంస్థల సిబ్బంది వేతనాల్లో 80శాతం మేర అక్కడి ప్రభుత్వమే భరిస్తోంది. తన వంతుగా అమెరికా రెండు లక్షల కోట్ల డాలర్ల భూరి ప్యాకేజీలో భాగంగా లక్షలాది శ్రామికులకు సాయపడుతోంది.

ఎన్నడూ లేని విధంగా..

ఆస్ట్రేలియాలో నిరుద్యోగ భృతిని రెట్టింపు చేశారు. జర్మనీ, ఫ్రాన్స్‌, సింగపూర్‌, యూఏఈ వంటివి చిన్న తరహా సంస్థలకు కొండంత అండగా నిలిచి ఔదార్యం చాటుకుంటున్నాయి. స్వతంత్ర భారత చరిత్రలో ఇంతటి ఆర్థిక సంక్షోభం ఎన్నడూ చోటుచేసుకోలేదని అమాత్యులెందరు చెబుతున్నా- వ్యవస్థాగతంగా గట్టి దన్ను ఇప్పటికీ అందని మానిపండునే తలపిస్తోంది!

ప్రభుత్వాలదే బాధ్యత

వాణిజ్య కార్యకలాపాలు సన్నగిల్లిన కారణంగా ఉద్యోగులెవర్నీ తొలగించవద్దని, జీతాలకు కోతపెట్టవద్దని సంస్థల యాజమాన్యాలకు ఈపీఎఫ్‌ఓ (ఉద్యోగుల భవిష్యనిధి) ఇటీవల పిలుపిచ్చింది. యథార్థానికి జరగాల్సిందేమిటో భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) వివరణాత్మకంగా సూచించింది. వందమందిలోపు ఉద్యోగులున్న సంస్థల్లో పీఎఫ్‌ వాటాను కేంద్రమే చెల్లించాలని, ఈఎస్‌ఐ పరిధిలో ఉన్నవారికి కేంద్రమే వేతనం ఇవ్వాలని, జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ కలిగిన సంస్థల ఉద్యోగుల జీతాల్నీ చెల్లించాలన్నది సీఐఐ హితవాక్యం. ఆవిరైపోయిన ఉపాధి అవకాశాల స్థానే కొత్తవాటి సృష్టి, జీవిక కోల్పోయినవారికి కొన్నాళ్లపాటు ఆర్థిక తోడ్పాటు- ప్రభుత్వాల జంట లక్ష్యాలు కావాలి. తయారీ రంగంలో 45 శాతం, ఎగుమతుల్లో 40శాతం వాటా కలిగిన సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమ(ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ)లెన్నో ఆపన్న హస్తం కోసం నిరీక్షిస్తున్నాయి. వాటిలో 70శాతానికి పైగా మార్చి నెల జీతాలు ఇవ్వలేకపోయాయి. నిరుద్యోగ రక్కసి రెచ్చిపోకుండా- ఉద్యోగుల్ని, పరిశ్రమల్ని ఆదుకునేలా ప్రభుత్వ ఉదార సంక్షేమ చర్యలు... సూక్ష్మ సంస్థలతోనే మొదలు కావాలి!

ఇదీ చూడండి: 'కరోనా వ్యాప్తికి వర్గాన్ని, ప్రాంతాన్ని కారణంగా చూడకండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.