2008 ముంబయి ఉగ్రదాడుల సూత్రధారి, నిషేధిత జమాత్ ఉద్ దవా (జేయూడీ) అధినేత హఫీజ్ సయీద్ బ్యాంకు ఖాతాలను పునరుద్ధరించారు పాక్ అధికారులు. అతనితో పాటు మరో నలుగురివి కూడా పునరుద్ధరించినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. ఐక్యరాజ్యసమితి ఆంక్షల కమిటీ ఆమోదం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
లష్కరే తోయిబాకు చెందిన అబ్దుల్ సలామ్ భుట్టావి, హాజీ ఎం అష్రఫ్, యహ్యా ముజాహిద్, జాఫర్ ఇక్బాల్ అకౌంట్లను కూడా పునరుద్ధరించింది. వీరంతా ఉగ్రవాదులకు డబ్బు చేరవేసిన కేసులో లాహోర్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి చెందిన కమిటీ ఆమోదం తర్వాతే వీరి బ్యాంక్ ఖాతాలను పునరుద్ధరించినట్లు స్ధానిక మీడియా తెలిపింది.
తమ కుటుంబ పరిస్థితులు సరిగాలేనందు సయిద్ బ్యాంక్ ఖాతాలను పునరుద్ధరించాలని ఐరాసకు జేయూడీ నాయకులు లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఖాతా నెంబరు, ఆదాయం వచ్చే మార్గాలు, ఇతర వివరాలను పూర్తి స్థాయిలో లేఖలో పొందుపరిచినట్లు మీడియా తెలిపింది.
2008లో సయీద్ నేతృత్వంలోని లష్కరే తోయిబా సంస్థ ముంబయిలో జరిపిన ఉగ్రదాడి కారణంగా 166 మంది మృతి చెందారు. వీరిలో ఆరుగురు అమెరికన్లు కూడా ఉన్నారు. దీంతో అమెరికా ట్రెజరీ విభాగం సయీద్ను 2008 డిసెంబర్లో అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది.