కరోనా వైరస్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. చిన్న, పెద్ద, ధనిక, పేద అన్న తేడా లేకుండా అందరినీ అనారోగ్యానికి గురిచేస్తోంది. అలానే బ్రిటన్ యువరాజు చార్లెస్ ఇటీవల కరోనా బారిన పడ్డారు.
అయితే... ప్రిన్స్ చార్లెస్ ఆయుర్వేదం, హోమియోపతి చికిత్స ద్వారా ప్రాణాంతక వైరస్ బారి నుంచి బయటపడినట్లు కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ తెలిపారు. బెంగళూరుకు చెందిన సౌఖ్య హోలిస్టిక్ రిసార్ట్ ద్వారా చికిత్స అందించినట్లు వెల్లడించారు.
"బెంగళూరు సౌఖ్య ఆయుర్వేద రిసార్ట్కు చెందిన డాక్టర్ మథాయ్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. ఆయుర్వేదం, హోమియోపతి ద్వారా బ్రిటన్ యువరాజు చార్లెస్ మహమ్మారి కరోనా నుంచి కోలుకున్నారని నాకు చెప్పారు."
-శ్రీపాద్ నాయక్, కేంద్ర మంత్రి
ప్రిన్స్ చార్లెస్కు అందించిన చికిత్సపై అధ్యయనం చేయటం కోసం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఓ టాస్క్పోర్స్ ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. చికిత్స చేసిన విధానంపై నివేదిక అందించాలని మథాయ్ను కోరినట్లు వెల్లడించారు.
అంతా అసత్యం...
ఆయుర్వేదం, హోమియోపతి వైద్యంతో యువరాజు కోలుకున్నారన్న వార్తల్ని ఆయన అధికార ప్రతినిధి ఖండించారు. బ్రిటన్ జాతీయ ఆరోగ్య సంస్థ సూచించిన చికిత్సను మాత్రమే చార్లెస్ తీసుకున్నారని స్పష్టంచేశారు.
ఇదీ చూడండి:అమెరికా అధ్యక్షుడికి మరోసారి కరోనా పరీక్ష