అయోధ్య కేసులో సుప్రీంకోర్టు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 18లోపు నివేదిక సమర్పించాలని అయోధ్య వివాదంలో శాశ్వత పరిష్కారానికి ఏర్పాటైన మధ్యవర్తుల కమిటీని సుప్రీంకోర్టు కోరింది. నివేదికను పరిశీలించాక అవసరమనుకుంటే ఈ నెల 25 నుంచి రోజువారీ విచారణ చేపడతామని తెలిపింది.
అయోధ్య భూ వివాదంపై త్వరగా విచారణ చేపట్టాలని కేసులోని ఫిర్యాదుదారు గోపాల్ సింగ్ విశారద్ వ్యాజ్యం దాఖలు చేశారు. వివాద పరిష్కారానికి ఏర్పాటైన మధ్యవర్తిత్వ కమిటీ ప్రయత్నాల్లో పెద్దగా పురోగతి లేదని వ్యాజ్యంలో పేర్కొన్నారు.
గోపాల్ పిటిషన్ను పరిశీలించిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదీ కేసు
అయోధ్యలోని 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని సున్నీ వక్ఫ్ బోర్డ్, నిర్మోహి అఖాడా, రామ్ లల్లాకు సమానంగా పంచాలని 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పునకు వ్యతిరేకంగా ఇప్పటివరకు సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి.
ఈ వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు మార్చి 8న కీలక నిర్ణయం తీసుకుంది. వివాద శాశ్వత పరిష్కారానికి మధ్యవర్తిత్వమే మార్గమని తీర్మానించింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఖలీఫుల్లా ఛైర్మన్గా మధ్యవర్తిత్వ ప్యానెల్ ఏర్పాటు చేసింది. ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్, సీనియర్ న్యాయవాది శ్రీరామ్ పంచూను సభ్యులుగా నియమిస్తూ జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది. నివేదిక సమర్పించేందుకు ప్యానెల్కు 8 వారాల గడువు ఇచ్చింది.
జస్టిస్ ఖలీఫుల్లా నేతృత్వంలోని ప్యానెల్... ఉత్తర్ప్రదేశ్ ఫైజాబాద్ వేదికగా భాగస్వామ్యపక్షాలతో సమాలోచనలు జరిపింది. మొదటి దఫాలో జరిగిన చర్చల సారాంశాన్ని నివేదిక రూపంలో మే నెలలో సుప్రీంకోర్టుకు అందజేసింది. ప్యానెల్ అభ్యర్థన మేరకు మధ్యవర్తిత్వానికి గడువును ఆగస్టు వరకు పెంచింది సుప్రీంకోర్టు.
ఇదీ చూడండి: అయోధ్యపై మధ్యవర్తిత్వం