సైన్యంలో ఉన్న మహిళలు కమాండ్ బాధ్యతలు చేపట్టేందుకు కూడా అర్హులేనని స్పష్టం చేస్తూ.. మూడు నెలల్లోగా మహిళలకు శాశ్వత కమిషన్ కల్పించాలని సుప్రీం తీర్పు ఇచ్చింది. ఈ నిర్ణయంపై లెఫ్టినెంట్ కల్నల్ సీమాసింగ్ స్పందించారు. సుప్రీం తీర్పు సమాజంలో చారిత్రక మార్పు తీసుకువస్తుందని హర్షం వ్యక్తం చేశారు.
"ఇది ఎంతో ప్రగతిశీలమైన తీర్పు. ఈ నిర్ణయంతో మహిళలకు సైన్యంలో చేరడానికి ఎన్నో మార్గాలు తెరుచుకుంటాయి. వారికి మంచి కెరీర్ లభిస్తుంది. దేశసేవలో ముందుకు నడవాలనుకునేవారు, సైన్యంలో చేరాలనుకునేవారు ఎలాంటి సందేహాలు లేకుండా చేరొచ్చు. మహిళలు సాయుధ దళాలకు అనర్హులనే వాదనలకు వ్యతిరేకంగా మేము పోరాడాం. సైన్యంలో మహిళలు, పురుషులకు సమాన శిక్షణ ఉంటుంది. రానున్న కాలంలో వారికి సమాన హక్కులు కూడా లభిస్తాయని నాకు నమ్మకం ఉంది."
-సీమా సింగ్, లెఫ్టినెంట్ కల్నల్
వివక్ష ఖతం..
సాయుధ దళాల్లో లింగ వివక్షకు ముగింపు పలికేలా.. సైన్యంలో మహిళలకు శాశ్వత కమిషన్ కల్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు. ఈ మేరకు గతంలో దిల్లీ హైకోర్టు తీర్పును సమర్థిస్తూ.. ప్రభుత్వ పిటిషన్ను తోసిపుచ్చింది. శారీరక పరిమితులు, సామాజిక నిబంధనలతోనే సైన్యంలో మహిళలకు శాశ్వత కమిషన్ ఇవ్వలేకపోతున్నామన్న కేంద్రం వాదనలను తోసిపుచ్చింది సుప్రీం.
ఇదీ చదవండి:ఆ రైల్లోని 64వ సీటు శివుడికే శాశ్వతంగా కేటాయింపు!