ఉత్తర్ ప్రదేశ్లో విజృంభించిన హత్యాచారాల నీచపు పర్వంలో మరో బాలిక బలైంది. సరిగ్గా 22 రోజుల క్రితం.. హాథ్రస్ దళిత యవతిపై అఘాయిత్యం జరిగిన రోజే.. అదే గ్రామానికి చెందిన ఆరేళ్ల చిన్నారి అలీఘఢ్లో ఓ కామాంధుడి చేతిలో చిత్రవధ అనుభవించింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూసింది. దీంతో హాథ్రస్వ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి.
హాథ్రస్కు చెందిన బాలిక తల్లి ఈ ఏడాది జవరిలో మృతి చెందింది. దీంతో, అలీఘఢ్లోని ఓ బంధువు ఇంట్లో ఆశ్రయం పొందింది ఆ చిన్నారి. చేరదీసిన బంధువు కుమారుడు సెప్టెంబర్ 14న అభం శుభం తెలియని ఆ చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. తీవ్రంగా గాయపడిన చిన్నారికి అలీఘఢ్ మెడికల్ కళాశాల ఆసుపత్రిలో చికిత్స అందించారు. దాదాపు ఇరవై రోజులకు పైగా ప్రాణాలతో పోరాడి తుదిశ్వాస విడిచింది ఆ బాలిక.
నిందితుడిని అరెస్ట్ చేయకుండా...
అయితే, ఇంత దారుణానికి ఒడిగట్టిన వ్యక్తిని వదిలిపెట్టి అత్యాచారంతో సంబంధం లేని, మానసిక స్థిమితం లేని నిందితుడి సోదరుడిని అలీఘఢ్ పోలీసులు అరెస్ట్ చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు బాలిక తండ్రి. అసలైన నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
న్యాయం చేస్తామని బాలిక కుటుంబ సభ్యులకు స్థానిక అధికారులు భరోసా ఇచ్చారు. నిరసనలు విరమించి, అంత్యక్రియలు నిర్వహించాలని కోరారు.
ఇదీ చదవండి: 'హాథ్రస్ ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించండి'