కరోనాపై పోరాడుతున్న యోధుల వల్లే మనమంతా సురక్షితంగా ఉన్నామన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతన్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బిహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన నితీశ్ కుమార్ ప్రభుత్వంపైనా ప్రశంసలు కురిపించారు.
కరోనాను ఎదుర్కోవడంలో బిహార్లో నితీశ్కుమార్ సర్కార్ గొప్పగా పనిచేస్తోందని అన్నారు. ఆర్జేడీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 3.9గా ఉన్న వృద్ధి రేటు ప్రస్తుతం 11.3గా వృద్ధి చెందిందని వెల్లడించారు. లాంతరు వెలుగులా ఉన్న రాష్ట్రాభివృద్ధి.. నేడు ఎల్ఈడీ కాంతిలా విరజిమ్ముతోందని అభివర్ణించారు. త్వరలో జరుగబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సారి ఎన్నికల్లో మూడింట రెండొంతుల మెజార్టీ సాధిస్తుందని అమిత్షా ధీమా వ్యక్తంచేశారు.
'ఆత్మనిర్భర్' ముఖ్య ఉద్దేశం
ర్యాలీలో పాల్గొన్న షా.. ఈ వీడియో కాన్ఫరెన్స్ రాజకీయ లబ్ది కోసం కాదని కరోనాతో కుదేలైన అన్ని రంగాలకు చేయూతనిచ్చే 'ఆత్మనిర్భర్' ప్యాకేజీ ఉపయెగాలను ప్రజలకు తెలియ చెప్పడమే ముఖ్య ఉద్దేశమని నొక్కి చెప్పారు. ఇలాంటివి మరో 75 సమావేశాలు నిర్వహిస్తారని తెలిపారు.
అంతర్జాతీయంగా మంచిపేరు
మోదీ ప్రభుత్వంలో భారత రక్షణ విధానం అంతర్జాతీయంగా మంచిపేరు తెచ్చుకుందని అన్నారు షా. ఉరి, పుల్వామా ఘటనలపై ప్రభుత్వం గట్టిగా స్పందించిందని గుర్తు చేశారు. ముష్కరులు సరిహద్దులు దాటుతున్నా గతపాలకులు పట్టించుకోలేదని.. ఇప్పుడు ఆ సమస్యని తమ ప్రభుత్వం సమర్థంగా పరిష్కరిస్తోందని చెప్పుకొచ్చారు. గత 70ఏళ్లగా ఊబిలో ఇరుక్కుపోయిన సమస్యలను.. మోదీ 2.0లోని తొలి ఏడాది పాలన పరిష్కరించిందని అన్నారు.
కాంగ్రెస్పై విమర్శలు
కాంగ్రెస్ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించారు అమిత్ షా. తాము ప్రజలకు మంచి చేస్తుంటే... వాటిని కాంగ్రెస్ తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందని ప్రశ్నించారు? మోదీ ప్రభుత్వం ప్రజలకు గత ప్రభుత్వాలు అందించలేని సంక్షేమ పథకాలు అందిస్తోందని అన్నారు. నగదు బదిలీ, ఉచిత రేషన్తో పాటు ఎన్నో పథకాలు ప్రజలకు అందుతున్నట్లు ఉద్ఘాటించారు. మోదీ సర్కార్ కరోనా కాలంలో 1.25కోట్ల మంది వలస కూలీలను తమ స్వస్థలాలకు చేర్చిందని వెల్లడించారు.
ఇదీ చూడండి : అన్లాక్ 1.0: సోమవారం ఆతిథ్యం, పర్యటకం షురూ