దేశంలోని యూనివర్సిటీలు, కళాశాలల్లో నూతన విద్యా సంవత్సరం నవంబర్ 1న ప్రారంభం కానుంది. కరోనా నేపథ్యంలో విద్యా సంవత్సరం క్యాలెండర్కు సంబంధించి నిపుణుల కమిటీ రూపొందించిన మార్గదర్శకాలను యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్(యూజీసీ) ఆమోదించింది. డిగ్రీ, పీజీ తొలి ఏడాది విద్యార్థుల కోసం తయారు చేసిన నిబంధనలను యూజీసీ ఆమోదించినట్లు విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ట్వీట్ చేశారు.
కళాశాలల పునఃప్రారంభం కోసం యూజీసీ ఏప్రిల్లోనే ప్రత్యామ్నాయ విద్యా క్యాలెండర్ను ప్రకటించింది. సెప్టెంబర్ నుంచి కళాశాలలను తెరవాలని సూచించింది. అయితే కరోనా తీవ్రత పెరుగుతుండటం వల్ల ఈ ప్రణాళిక కార్యరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో తాజా మార్గదర్శకాలు రూపొందించింది.
సెలవులు కుదించి..
కరోనా కారణంగా కోల్పోయిన సమయాన్ని భర్తీ చేయడానికి వేసవి, శీతాకాల సెలవులను కుదించాలని నిపుణుల కమిటీ సూచించింది. విశ్వవిద్యాలయాలు ఆరు రోజుల పాటు నిత్యం విద్యాభ్యాస కార్యక్రమాలు నిర్వహించాలని స్పష్టం చేసింది.
సవరించిన మార్గదర్శకాలు ఇలా..
- అక్టోబర్ 31 నాటికి తొలి సంవత్సరం విద్యార్థుల అడ్మిషన్ ప్రక్రియ పూర్తి కావాలి.
- తొలి సెమిస్టర్ క్లాసులను నవంబర్ 1 నుంచి ప్రారంభించాలి.
- కరోనా కారణంగా కోల్పోయిన సమయాన్ని భర్తీ చేయడం కోసం వేసవి, శీతాకాల సెలవులను తగ్గించాలి.
- ఈ ఏడాది విద్యార్థులు సకాలంలో డిగ్రీ పట్టా పొందేలా వచ్చే ఏడాది విద్యా సంవత్సరాన్ని త్వరగా ప్రారంభించాలి.
- ప్రస్తుత బ్యాచ్ విద్యార్థులకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి 2020-21, 2021-22 విద్యా సంవత్సరాలలో వారానికి ఆరు రోజుల ప్రణాళికను యూనివర్సిటీలు అమలు చేయాలి.
నియంత్రణలో లేని కారణాల వల్ల ఈ విద్యా సంవత్సరానికి నష్టం వాటిల్లిందని యూజీసీ పేర్కొంది. మధ్యలో విరామాల(వేసవి, శీతాకాల సెలవుల)ను తగ్గించడం వల్ల మూడేళ్ల యూజీ/పీజీ కోర్సుల విద్యార్థులు సకాలంలో తమ కోర్సు పూర్తి చేసుకోగలుగుతారని పేర్కొంది.
మార్చి 16 నుంచి దేశంలో కళాశాలలు, పాఠశాలలను మూతపడ్డాయి. కరోనా వ్యాప్తి ప్రమాదకరంగా మారిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.