కరోనా వ్యాప్తి కారణంగా ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్(ఐహెచ్సీ) 81వ సమావేశం వాయిదా పడింది. డిసెంబర్ 28-30 తేదీల్లో నిర్వహించాల్సిన సమావేశాలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ఐహెచ్సీ అధికారికంగా ప్రకటించింది.
ఈ నేపథ్యంలో కీలకమైన సమస్యలను లేవనెత్తే ప్రఖ్యాత సంస్థగా.. 'ప్రొఫెసర్ ఎస్సీ మిశ్రా మెమోరియల్ లెక్చర్'ను ఆన్లైన్లో నిర్వహించాలని నిర్ణయించినట్లు ఐహెచ్సీ తెలిపింది. ఇందులో భాగంగా 'పంజాబ్ రైతుల నిరసనలు: విరోచిత అహింసా ప్రతిఘటన' అనే అంశంపై ప్రముఖ చరిత్రకారులు మృదులా ముఖర్జీ ప్రసంగిస్తారని వెల్లడించింది. డిసెంబర్ 28న ఉదయం 11 నుంచి 12.30 గంటల మధ్య ఈ కార్యక్రమం జరుగుతుందని వివరించింది.
"ఐహెచ్సీ 81వ సమావేశానికి అధ్యక్షుడిగా ఎంపికైన ప్రొఫెసర్ కేశవన్ వెలుతాట్.. ఈ కార్యక్రమానికి నేతృత్వం వహిస్తారు. డిసెంబర్ 28న 'పంజాబ్ రైతుల నిరసనలు: విరోచిత అహింసా ప్రతిఘటన' అంశంపై చర్చ ఉంటుంది. డిసెంబర్ 28, 29న 'భారతీయ నాగరితక: చారిత్రక దృక్పథాలు' అనే అంశంపై వెబినార్ జరుగుతుంది. ప్రఖ్యాత చరిత్రాకారుడు ప్రొఫెసర్ ఇర్ఫాన్ హబీబ్ ప్రారంభోపన్యాసం ఇస్తారు."
-ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్
వెబినార్ ప్రారంభ కార్యక్రమానికి ప్రస్తుత ప్రొఫెసర్ అమియా బగ్చీ అధ్యక్షత వహిస్తారని తెలిపింది. ఈ వెబినార్లో ఆదిత్య ముఖర్జీ, షిరీన్ మూస్వీ, కేఎం శిరిమాలి, రాజన్ గురుక్కల్, దీపక్ కుమార్, కుంకుమ్ రాయ్, సైయ్యద్ అలీ నదీ రెజావి, సుచేతా మహాజన్, సెల్వ కుమార్.. తదితరులు పాల్గొంటారని వెల్లడించింది. దీనికి ఇందు బంగ, అరుణ్ బందోపాధ్యాయ్లు నేతృత్వం వహిస్తారని స్పష్టం చేసింది. వెబినార్కు కార్యదర్శి ఆర్ మహాలక్ష్మి, నదీమ్ రెజావి, బర్టన్ క్లీటస్లు కన్వినర్లుగా ఉన్నారని పేర్కొంది.
ఇదీ చదవండి: దేశంలో మరోసారి 20వేల దిగువకు కరోనా కేసులు