ఆన్లైన్లో వినియోగాదారులు ఆర్డర్ చేసిన కత్తులను డెలివరీ చేయొద్దని అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ-కామర్స్ సంస్థలను కోరారు ఛత్తీస్గఢ్ పోలీసులు. రాష్ట్ర రాజధాని రాయ్పుర్లో కత్తిపోటు ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.
గత కొన్ని నెలలుగా కత్తిపోటు ఘటనలు, మరణాలు పెరిగాయని.. ఈ కేసులకు ఆన్లైన్లో కొనుగోలు చేసిన కత్తులతో సంబంధాలున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ కేసులకు సంబంధించి ఇప్పటికే పలువురి నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరిలో ఎక్కువగా మైనర్లే ఉన్నట్లు చెప్పారు.
"రాజధాని నగరంలో పెరుగుతున్న కత్తిపోటు ఘటనలను దృష్టిలో ఉంచుకుని రాయ్పుర్ పోలీసులు ఓ ప్రచారాన్ని ప్రారంభించారు. గతేడాది కత్తులను ఆర్డర్ చేసిన వ్యక్తుల కోసం ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి ఆన్లైన్ ఈ-కామర్స్ సంస్థల నుంచి డేటాను పోలీసులు సేకరించారు. ఈ జాబితా ఆధారంగా 2020లో 800 మంది కత్తులు ఆర్డర్ చేసినట్లు తేలింది. వీటిలో రాయ్పుర్ నుంచి 502, ఇతర జిల్లాల నుంచి 298 ఆర్డర్లు వచ్చినట్లు తెలిసింది."
- ఛత్తీస్గఢ్ పోలీసులు
ఇదీ చూడండి: ఇంట్లో మూడు అస్థిపంజరాలు- ఎవరివి?