కశ్మీర్ లోయలోని చీనాబ్ నదిపై తలపెట్టిన రైలు వంతెన ఆర్చ్ పనులు పూర్తి అయ్యాయి. కత్రా నుంచి బనిహాల్ మధ్య 111కిలోమీటర్ల రైల్వే మార్గం నిర్మాణంలో అత్యంత ప్రధానమైన స్టీల్ ఆర్చ్ నిర్మాణం పూర్తయింది. ఉత్తర రైల్వేకు ఇదో చారిత్రక ఘట్టమని అధికారులు పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఈ వంతెన ఏడాది కాలంలో పూర్తవుతుందని తెలిపారు. 1.3 కిలోమీటర్లు పొడువైన ఈ వంతెనను.. ఉధంపుర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లైన్ ప్రాజెక్టులో భాగం రూ.1,486 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు.
2002లో ఈ వంతెన నిర్మాణ పనులు ప్రారంభమైనప్పటికీ కొన్ని భద్రతా కారణాల దృష్ట్యా నిలిచిపోయాయి. మళ్లీ 2017 జులైలో ప్రారంభమయ్యాయి. ఆ సమయంలో ఈ ప్రాజెక్టును 2019 చివరినాటికి పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. అయితే 2018లో కాంట్రాక్టు సమస్యల కారణంగా జాప్యం కాగా.. కరోనా వల్ల మరింత ఆలస్యమైంది.
చీనాబ్ వంతెన ఫీచర్లు..
- ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన. నది మట్టానికి 359 మీటర్లు ఎత్తులో ఉంది. పారిస్లోని ఐఫిల్ టవర్ కన్నా 35 మీటర్లు ఎత్తైనది. ఈ ఆర్చ్ మొత్తం బరువు 10,619 మెట్రిక్ టన్నలు.
- ఈ ఆర్చ్లో ఉక్కు పెట్టెలు ఉంటాయి. వంతెనకు స్థిరత్వాన్ని అందించడానికి వీటిని కాంక్రీటుతో నింపుతారు.
- ఈ వంతెన నిర్మాణానికి ఉపయోగించే ఉక్కు 10 డిగ్రీల సెంటిగ్రేడ్ నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతకు అనుకూలంగా ఉంటుంది. దీనిని గంటకు 266 కిలోమీటర్ల వేగంతో వచ్చిన గాలులను కూడా తట్టుకునేలా రూపొందించారు.
- ఈ ప్రాంతంలో ఉగ్రవాద ముప్పును దృష్టిలో ఉంచుకుని దీని ప్రణాళిక రూపొందించారు. ఈ వంతెన దేశంలోనే అత్యధిక తీవ్రత కలిగిన వీ-జోన్ భూకంపాలను కూడా తట్టుకోలదు.
ఇదీ చూడండి: రఫేల్ ముడుపులపై రాజకీయ రగడ