Amit Shah Manipur Visit : కలహాలతో అట్టుడుకుతున్న మణిపుర్లో శాంతిని పునరుద్ధరించే లక్ష్యంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం ఉదయం మహిళా బృందంతో సమావేశమైనట్లు అమిత్ షా ట్వీట్ చేశారు. మణిపుర్ సమాజంలో మహిళల పాత్రను కొనియాడారు. శాంతిని నెలకొల్పేందుకు కట్టుబడి ఉన్నట్లు అమిత్ షా స్పష్టం చేశారు. తర్వాత పౌర సమాజ నాయకులతో అమిత్ షా సమావేశమయ్యారు.
సోమవారం రాత్రి హోంశాఖ కార్యదర్శితో కలిసి మణిపుర్కు చేరుకున్న అమిత్ షా.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్, సైనిక అధికారులతో సమావేశమై రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిపై చర్చించారు. నిత్యావసరాల ధరలు తగ్గించేందుకు సరఫరాలను పెంచాలని సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ నెల ప్రారంభంలో హింస చెలరేగిన చురాచాంద్పుర్లో పర్యటించారు. అక్కడ నెలకొన్న పరిస్థితులపై కుకీ, మెయితీ వర్గాలతో ఆయన చర్చలు జరిపారు. మంగళ, బుధ వారాల్లో కూడా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

మణిపుర్కు స్పెషల్ ఆఫీసర్
Manipur Violence : మణిపుర్లో పరిస్థితిని అదుపు చేసేందుకు సీనియర్ పోలీస్ అధికారిని ఆ రాష్ట్రానికి పంపించింది కేంద్రం. ప్రస్తుతం సీఆర్పీఎఫ్ ఐజీగా ఉన్న రాజీవ్ సింగ్ను.. మణిపుర్కు ప్రత్యేక అధికారిగా నియమించింది. 1993 త్రిపుర్ ఐపీఎస్ కేడర్కు చెందిన ఆయన్ను.. 3 సంవత్సరాల పాటు ఇంటర్ కేడర్ డిప్యూటేషన్పై మణిపుర్లో పనిచేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన్ను సీఆర్పీఎఫ్ నుంచి రిలీవ్ చేయాలని ఆ సంస్థను ఆదేశించింది కేంద్రం హోం శాఖ.


రాష్ట్రపతికి కాంగ్రెస్ వినతిపత్రం
Congress Of Manipur Violence : మణిపుర్లో నెలకొన్న పరిస్థితులపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు వినతిపత్రం అందజేసింది కాంగ్రెస్. జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నేతృత్వంలోని బృందం 12 డిమాండ్లతో కూడిన లేఖను ముర్ముకు అందజేసింది. సుప్రీంకోర్టు సిట్టింగ్ లేదా రిటైర్డ్ జడ్జితో ఉన్నత స్థాయి కమిషన్ వేసి విచారించాలని కోరింది కాంగ్రెస్.


వేర్పాటువాదంతో సంబంధం లేదు : ఆర్మీ సీడీఎస్
మణిపుర్ హింసకు రెండు జాతుల మధ్య నెలకొన్న వైరమే కారణమని.. దానికి వేర్పాటువాదంతో ఎటువంటి సంబంధం లేదని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ వెల్లడించారు. మణిపుర్ ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తున్నామని తెలిపారు. పెద్ద సంఖ్యలో ప్రజల ప్రాణాలను కాపాడినట్లు చెప్పారు. మణిపుర్లో సమస్యలు తక్షణమే పరిష్కారం కావని, వాటికి కొంత సమయం పడుతుందని వెల్లడించారు. త్వరలోనే పరిస్థితులు పూర్తిగా సద్దుమణుగుతాయని భావిస్తున్నట్లు తెలిపారు.

వారికి రూ.10 లక్షల పరిహారం.. ప్రభుత్వ ఉద్యోగం
ఈ జాతుల మధ్య హింసలో మరణించిన వారికి రూ.10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని కేంద్రం, మణిపుర్ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. దీంతోపాటు బాధిత కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కూడా ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పరిహారం సొమ్ములో చెరి సగం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించనున్నాయి.

Manipur Violence Why : ఎస్టీ హోదా కోసం మెయిటీలు చేసిన డిమాండ్కు మణిపుర్ వ్యాలీ ప్రాంతపు చట్టసభ్యుల నుంచి మద్దతు లభించింది. దీంతో గిరిజన ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇది ఘర్షణకు దారితీసింది. మణిపుర్ జనాభాలో 53 శాతం మంది మెయిటీ వర్గానికి చెందినవారే. ఈ నేపథ్యంలో తలెత్తిన తీవ్ర హింసాత్మక ఘర్షణను అణిచివేసేందుకు 10వేల మందికి పైగా కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి. ఆర్మీతో పాటు అసోం రైఫిల్స్, పారామిలిటరీ బలగాలు సంయుక్త ఆపరేషన్లు చేపట్టి ఆందోళనలను అణచివేశాయి.
ఇవీ చదవండి : 40 మంది తిరుగుబాటుదారులు హతం.. ఇద్దరు పౌరులు మృతి.. మణిపుర్కు అమిత్ షా!
మణిపుర్కు అమిత్ షా.. నాలుగు రోజులు అక్కడే.. వారి కుట్రను భగ్నం చేసిన ఇండియన్ ఆర్మీ!