భారత్-పాకిస్థాన్ సైన్యాల మధ్య పూంఛ్-రావల్కోట్ క్రాసింగ్ పాయింట్ వద్ద బ్రిగేడ్ కమాండర్ స్థాయి సమావేశం జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇరు దేశాల డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ సమావేశంలో కుదిరిన ఒప్పందాలను అమలు చేసే విషయంపై సైన్యాధికారులు చర్చించారు.
నియంత్రణ రేఖ వద్ద శాంతి స్థాపనే లక్ష్యంగా ఫిబ్రవరిలో జరిగిన సమావేశంలో భారత్, పాకిస్థాన్ కీలక నిర్ణయం తీసుకున్నాయి. సరిహద్దులో కాల్పుల విరమణ ఒప్పందాలకు తూచా తప్పకుండా కట్టుబడి ఉండాలని తీర్మానించాయి. రెండు దేశాల సైన్యాల డైరక్టర్ జనరళ్ల స్థాయి చర్చల్లో ఈమేరకు ఏకాభిప్రాయానికి వచ్చాయి. శాంతికి భంగం కలిగించి, హింసకు దారితీసే సమస్యలను పరిష్కరించుకునేందుకు పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించుకున్నట్టు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. అయితే ఉగ్రవాద వ్యతిరేక చర్యలు కొనసాగుతాయని భారత సైన్యం స్పష్టం చేసింది. సరిహద్దు వెంబడి.. పాక్ సైన్యం సహాయంతో జమ్ముకశ్మీర్లోకి చొరబడుతున్న వారిని అడ్డుకుంటామని పేర్కొంది.