పల్లెలే దేశానికి పట్టుకొమ్మలంటూ ప్రభుత్వాలు ఘనంగా చెబుతున్నా.. గ్రామాల్లో అది ప్రతిబింబించడం లేదు. కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ నిర్వహించిన మిషన్ అంత్యోదయ సర్వే-2019ని పరిశీలిస్తే ఈ అంశం స్పష్టమవుతోంది. దాదాపు 80 శాతానికిపైగా గ్రామాల్లో వైద్య సౌకర్యాలు లేవని తేలింది. 6 శాతం గ్రామాల్లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 14.5 శాతం గ్రామాల్లో ప్రాథమిక వైద్య కేంద్రాలు, 23.5 శాతం గ్రామాల్లో ఆరోగ్య ఉపకేంద్రాలు, 11.5 శాతం గ్రామాల్లో మాత్రమే జన ఔషధీ కేంద్రాలు ఉన్నట్లు తేలింది.
దేశవ్యాప్తంగా ఉన్న 2,66,430 పల్లెల్లో సర్వే చేసిన అనంతరం.. ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. భూసార పరీక్ష కేంద్రాలు, రైల్వే స్టేషన్లు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, వృత్తి విద్యా కేంద్రాలు, వ్యవసాయ విస్తరణ కేంద్రాలు.. కేవలం 10 శాతంలోపు పల్లెలకు మాత్రమే పరిమితమయ్యాయి. గ్రామాల్లో అత్యధికంగా ఉన్న సౌకర్యం అంగన్వాడీ కేంద్రాలే. మొబైల్ ఫోన్ సౌకర్యం, ఇంటర్నెట్/బ్రాడ్బ్యాండ్, పోస్టాఫీసులు, పంచాయతీ భవనాలు, రహదారి అనుసంధానం బాగానే ఉన్నట్లు తేలింది.
మరోవైపు.. వైద్య ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన గ్రామీణ వైద్య నివేదిక ప్రకారమూ పల్లెల్లో ఉన్న ఆసుపత్రుల్లోనూ సరైన వైద్య సిబ్బంది లేరు. డాక్టర్ల నుంచి ల్యాబ్ టెక్నీషియన్లవరకు 80వేలకుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అందులో తేలింది.
ఇదీ చదవండి: మతి పోగొట్టే మానవత్వం!