By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 20, 2023, 12:37 PM IST
|Updated : Dec 20, 2023, 1:00 PM IST
పంచాయతీ ఆస్తులు దోచుకున్న వైఎస్సార్సీపీ ఉప సర్పంచి - వార్డు సభ్యుల ఆందోళన
Ward Members Protest Against YCP Upa Sarpanch: అనంతపురం జిల్లా ఉరవకొండ పంచాయతీ వైఎస్సార్సీపీ బలపరిచిన ఉప సర్పంచి వన్నప్పకు వ్యతిరేకంగా వార్డు సభ్యులు ఆందోళన చేపట్టారు. వన్నప్ప పంచాయతీకి చెందిన విలువైన స్థలాన్ని విక్రయించడంతో పాటు టెండరు మొత్తాన్ని చెల్లించకుండా ఉన్నా అక్రమాలకు పాల్పడుతున్నా అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడం దారుణమని వైసీపీ వార్డు సభ్యులు విమర్శించారు. ఆయనపై చర్యలు చేపట్టాలని కోరుతూ వార్డు సభ్యులు, వైసీపీ నాయకులతో కలసి ఉరవకొండ పట్టణంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు.
పంచాయతీ కార్యదర్శి గౌస్ సాహెబ్ ఎదుట ప్లకార్డులతో నిరసన తెలిపారు. బాధ్యతాయుతంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధి బహిరంగంగా అక్రమాలకు పాల్పడుతుండడంతో పాటు పంచాయతీ నిధులలో అక్రమాలకు పాల్పడుతున్నా అధికారులు నిర్లక్ష్యం వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అతని అక్రమాలపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా ఉన్నతాధికారులు సైతం స్పందించలేదని విమర్శించారు. వెంటనే ఉప సర్పంచిపై చర్యలు తీసుకోకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.