ఓటర్ చైతన్య కార్యక్రమానికి విశేష స్పందన - ఫారం-6తో కొత్త ఓటుకు దరఖాస్తుల వెల్లువ - Form 7 Applications in AP
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 3, 2023, 3:35 PM IST
Voter Awareness Programs in NTR District : ఎన్టీఆర్ జిల్లా నందిగామ పురపాలక సంఘం పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఓటర్ చైతన్య కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ఓటర్లు స్వచ్ఛందంగా వచ్చి తమ ఓటును జాబితాలో పరిశీలించుకుంటున్నారు. ఓట్లు గల్లంతయిన వారు తిరిగి ఫారం-6తో కొత్త ఓటుకు దరఖాస్తు చేస్తున్నారు. డీవీఆర్ కాలనీలోని 107, 108, 109 పోలింగ్ కేంద్రాల్లో కొంతమందికి రెండు, మూడు ఓట్లు ఉన్నాయి. దీంతో ప్రధాన పార్టీల ప్రతినిధులు వాటిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దరఖాస్తు చేస్తున్నారు.
అదే విధంగా కొంతమందికి నందిగామ పోలింగ్ కేంద్రాలతో పాటు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లోనూ ఓట్లు ఉన్నాయి. కొంతమందికి డబుల్ ఓట్లు ఉండటంతో ప్రధాన పార్టీల ప్రతినిధులు మండిపడ్డారు. నందిగామలోని 10 పోలింగ్ కేంద్రాలలో యువత ఉత్సాహంగా కొత్త ఓటు కోసం దరఖాస్తులు చేస్తున్నారు. నియోజకవర్గంలోని 222 పోలింగ్ కేంద్రాల్లో కొన్ని కేంద్రాల్లో బీఎల్వోలు సకాలంలో విధులు హాజరు కాలేదు. దీంతో కేంద్రాల్లో బీఎల్వోల కోసం ఓటర్లు నిరీక్షించాల్సిన పరిస్థితి వచ్చింది.