Police Questioned Vallabhaneni Vamsi : మొదటి రోజు పోలీసు కస్టడీలో అడిగిన కీలకమైన ప్రశ్నలకు తనకేం తెలియదని, గుర్తులేదని వైఎస్సార్సీపీ నేత వల్లభనేని వంశీ సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. ఏసీపీల ఆధ్వర్యంలో ఆయణ్ని రెండున్నర గంటల పాటు విచారించారు. సుమారు 20 ప్రశ్నలకు పైనే అడిగినట్లు తెలిసింది. కొన్ని వీడియోలు చూపించి ప్రశ్నించగా తనకు సంబంధం లేదని వంశీ పోలీసులకు తెలిపినట్లు సమాచారం.
సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో అరెస్టై ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీని మూడు రోజుల పోలీసు కస్టడీకి విజయవాడ ఎస్సీఎస్టీ కోర్టు అనుమతిచ్చింది. దీంతో పోలీసులు ఈరోజు ఆయణ్ని కస్టడీలోకి తీసుకున్నారు. మరోవైపు ఇవాళ్టితో ఆయన రిమాండ్ గడువు ముగుస్తోంది. దీంతో ఉదయం 10:30 గంటల ప్రాంతంలో జైలులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వంశీని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. విచారణ జరిపిన కోర్టు మార్చి 11 వరకు రిమాండ్ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అనంతరం జైలు నుంచి వంశీని విజయవాడ జీజీహెచ్కి తీసుకెళ్లి గంటపాటు వైద్య పరీక్షలు నిర్వహించారు. అక్కడి నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. ఆయనతో పాటు ఏ7,ఏ8గా ఉన్న లక్ష్మీపతి , శివరామకృష్ణలను కూడా అక్కడికి తరలించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరపాలని కోర్టు ఆదేశాల్లో పేర్కొంది. వంశీతో ఆయన న్యాయవాది రోజుకు మూడు సార్లు ఐదు నిమిషాల చొప్పున మాట్లాడేందుకు అనుమతించాలని తెలిపింది. ఆ ప్రకారం వంశీ తరఫున లాయర్ కృష్ణలంక పీఎస్కు వచ్చారు.
Vallabhaneni Vamsi Case Updates : కృష్ణలంక పోలీస్స్టేషన్లో రెండున్నర గంటల పాటు వల్లభనేని వంశీని విచారించారు. ఈ విచారణలో ముగ్గురు ఏసీపీలు పాల్గొన్నారు. ఒక్కొక్క నిందితుడ్ని వేర్వేరుగా విచారణ జరిపారు. ఈ క్రమంలో వంశీని సుమారు 20 ప్రశ్నలను అడిగినట్లు తెలిసింది. చాలా ప్రశ్నలకు తనకు తెలియదని సమాధానమిచ్చినట్లు సమాచారం. సీసీ ఫుటేజీ ఆయనకు చూపించి సత్యవర్థన్ను ఎప్పుడు కలిశారు? ఎందుకు కలిశారు ? అని ప్రశ్నించినట్లు తెలిసింది. అన్ని ప్రశ్నలకు దాటవేసే ధోరణిలోనే సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. సాయంత్రం 3:15 గంటలకు మొదటి రోజు పోలీసుల విచారణ ముగిసింది. అనంతరం కృష్ణలంక పీఎస్ నుంచి ఆయణ్ని విజయవాడ జీజీహెచ్కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత జిల్లా జైలు అధికారులకు ఆయనతో పాటు మరో ఇద్దరు నిందితులను అప్పజెప్పారు.
మరోవైపు వంశీ బెయిల్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేసేందుకు పోలీసుల తరపు న్యాయవాది విజయవాడ ఎస్సీఎస్టీ ప్రత్యేక కోర్టును మరో మూడు రోజులు సమయం కోరారు. ఆయన అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది. ఈనెల 28న కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది.
వల్లభనేని వంశీ భూకబ్జాలపై సిట్ దర్యాప్తు వేగవంతం - మరో 2 కేసులు నమోదు