'నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్నాం, ఇక తప్పదు' - 27వ తేదీ నుంచి మున్సిపల్ కార్మికుల నిరవధిక సమ్మె - ఏపీ వార్తలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07-12-2023/640-480-20208999-thumbnail-16x9-municipal-jac.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 7, 2023, 5:02 PM IST
Municipal JAC called for an indefinite strike: డిసెంబర్ 27వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు వెళ్లనున్నట్లు మున్సిపల్ జేఏసీ నేతలు వెల్లడించారు. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నాలుగున్నర సంవత్సరాలుగా ఎదురు చూసి, తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెకు వెళ్తున్నట్లు జేఏసీ నేతలు పేర్కొన్నారు. విజయవాడలో మున్సిపల్ కార్మికుల సమస్యలపై జేఏసీ సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మున్సిపల్ కార్మికుల జేఏసీ నేతలు మాట్లాడారు.
మున్సిపల్ విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ , ఔట్సోర్సింగ్ సిబ్బందిని క్రమబద్ధీకరిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. గత నాలుగున్నర సంవత్సరాలుగా ఇచ్చిన హామీ అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య ఇంజనీరింగ్ విభాగ, డ్రైవర్లు స్వీపర్లు, డ్రైనేజీ కార్మికులకు 11వ పీఆర్సీ ఆధారంగా 20వేల రూపాయలు వేతనంతో పాటుగా, కరువు భత్యాన్ని ఇవ్వకుండా వేతనాలలో కోతలు విధించారని మండిపడ్డారు. ప్రజారోగ్యంలో పనిచేస్తున్న వారికి హెల్త్లోన్స్ ఇవ్వకుండా కోత విధించడాన్ని జేఏసీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలిపారు. డ్రైనేజీ వర్కర్లు విధుల్లో మరణిస్తే వారి కుటుంబాలకు 30 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని, అయినప్పటికి సుప్రీం ఆదేశాలు నేటికీ అమలు చేయలేదన్నారు. తక్షణమే మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఈ నెల 27వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు.