By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 16, 2024, 5:18 PM IST
తిరుపతిలో జోరుగా జల్లికట్టు - పలకలు చేజిక్కించుకునేందుకు యువకుల సాహసం
Jallikattu In Tirupathi District: సంక్రాంతి సంబరాలను పురస్కరించుకుని తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఏ. రంగంపేటలో ఈరోజు ఏర్పాటు చేసిన ఎడ్ల పందాలు ఉర్రూతలూగించాయి. సమీప గ్రామాల నుంచి పశువుల యజమానులు అలంకరించి పశువులను తీసుకువచ్చారు. పోటీ నిర్వాహకులు ఎడ్లకు పలకలు, వస్త్రాలు కట్టి విడతల వారీగా పందేనికి బరిలోకి వదిలారు. అప్పటికే అధిక సంఖ్యలో గ్రామానికి చేరుకున్న యువత వేగంగా పరుగులు తీస్తున్న పశువులను నిలువరించేందుకు పోటీ పడ్డారు.
Cattle Festival Celebrations Chandragiri Mandal: ఎడ్లను ఉసిగొల్పగా, కోడెగిత్తలు రంకెలేసుకుంటూ సందోహం నుంచి గిత్తలు పరుగు తీశాయి. ఎడ్లను నిలువరించి వాటి కొమ్ములకు కట్టిన పలకలను చేజిక్కించుకునేందుకు యువకులు సాహసాలు చేశారు. ఎడ్లను కట్టడి చేసేందుకు ఇరువర్గాల వారు పోటీలు పడ్డారు. పోట్లగిత్తలు జన ప్రవాహాన్ని సైతం లెక్క చేయకుండా జనాన్ని చీల్చుకుంటూ పరుగులు పెట్టాయి. జల్లికట్టును చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రతీ ఏటా సంక్రాంతికి ఈ కార్యక్రమం నిర్వహించటం ఇక్కడ ఆనవాయతీగా వస్తోంది.