Rajini on Cancer Treatment: ప్రతి ఆరుగురిలో ఒకరికి క్యాన్సర్.. తక్కువ ఖర్చుతో చికిత్స: మంత్రి రజిని - Minister Vidadala Rajini comments
🎬 Watch Now: Feature Video

Minister Vidada Rajini comments on cancer treatment: మారిన జీవన శైలి, ఆహార అలవాట్ల కారణంగా రాష్ట్రంలో ప్రతి ఆరు మందిలో ఒకరు.. క్యాన్సర్ బారిన పడుతుండటం చాలా బాధాకరమని.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజిని అన్నారు. రోజురోజుకీ పెరుగుతున్న క్యాన్సర్ బాధితులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే మెరుగైన చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. క్యాన్సర్ రోగులకు ప్రభుత్వ వైద్య పథకాల కింద తక్కువ ఖర్చుతో చికిత్స అందించటంపై ఈరోజు గుంటూరు జీజీహెచ్లోని నాట్కో క్యాన్యర్ విభాగంలో ఏర్పాటు చేసిన 'నేషనల్ క్యాన్సర్ గ్రిడ్-ఏపీ శాఖ' సదస్సులో ఆమె పాల్గొన్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. రాష్ట్రంలో గత నాలుగేళ్లలో 8.23 లక్షల క్యాన్సర్ కేసులు నమోదయ్యాయని.. వారిలో 2.8లక్షల మందికి ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించామని మంత్రి విడదల రజిని తెలిపారు. దీనికోసం రూ. 17వందల కోట్లకు పైగా వ్యయం చేశామని..ఇందులో ఈ ఏడాదే రూ.600 కోట్లు ఖర్చయిందని వివరించారు. మారిన జీవన శైలి, ఆహార అలవాట్ల కారణంగా ప్రతి ఆరుగురిలో ఒకరు క్యాన్సర్ బారిన పడుతుండటం బాధాకరమన్నారు. పెరుగుతున్న క్యాన్సర్ రోగులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం క్యాన్సర్ చికిత్స సౌకర్యాలను పెంచుతుందన్నారు. రాష్ట్రంలో మరో 7 వైద్య కళాశాలల్లో క్యాన్సర్ చికిత్సలను అందుబాటులోకి తెస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలని.. ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవో హరీంద్ర ప్రసాద్ తెలిపారు.