CM YS Jagan Tirupati Tour: నేటి నుంచి రెండు రోజుల పాటు ఉమ్మడి చిత్తూరు,కర్నూలులో సీఎం జగన్ పర్యటనలు..
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 18, 2023, 10:00 AM IST
CM YS Jagan Tirupati Tour: మఖ్యమంత్రి జగన్ ఇవాళ, రేపు తిరుపతి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి తిరుపతి చేరుకుంటారు. ముందుగా శ్రీనివాస సేతు ప్రారంభోత్సవం, ఆ తరువాత ఎస్వీ ఆర్ట్స్ కాలేజ్ హాస్టల్ బిల్డింగ్ని వర్చువల్గా ప్రారంభిస్తారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి చేరుకుని దర్శించుకుంటారు. తర్వాత తిరుమల చేరుకుని వకుళామాత రెస్ట్ హౌస్, రచన రెస్ట్ హౌస్లను ప్రారంభిస్తారు. అనంతరం బేడీ ఆంజనేయ స్వామిని దర్శించుకుని అక్కడి నుంచి శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు ప్రధాన ఆలయానికి చేరుకుంటారు. ఈ కార్యక్రమం తరువాత వాహన మండపం చేరుకుని పెద్ద శేష వాహనాన్ని దర్శించుకుంటారు. రాత్రికి పద్మావతి అతిథి గృహంలో బస చేస్తారు. మంగళవారం ఉదయం స్వామివారిని దర్శించుకున్న అనంతరం తిరుమల నుంచి ఓర్వకల్లు చేరుకుంటారు. అక్కడి నుంచి కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం లక్కసాగరం చేరుకుని డోన్, పత్తికొండ, ఆలూరు, పాణ్యం నియోజకవర్గాలకు చెందిన తాగు, సాగునీరు పథకాలు ప్రారంభిస్తారు. తరువాత నంద్యాల జిల్లా డోన్లో జరిగే బహిరంగసభలో పాల్గొంటారు. సభ అనంతరం అక్కడ నుంచి బయలుదేరి తాడేపల్లి చేరుకుంటారు.