By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 10, 2023, 7:27 PM IST
పేదలకు ఇళ్ల పేరిట వేల కోట్ల రూపాయల అవినీతి: టీడీపీ నేత బోండా ఉమ
Bonda Uma Comments on TIDCO Houses in AP: పేదల ఇళ్ల నిర్మాణాలను సీఎం జగన్ గాలికొదిలేశారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమ మండిపడ్డారు. పేదల సొంతింటి కలను తెలుగుదేశం నిజం చేసి చూపిస్తే, వైసీపీ ప్రభుత్వం కలగానే మిగిల్చిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఎద్దేవా చేసారు. టీడీపీ హయాంలో పేదల కోసం నిర్మించిన 3.13 లక్షల ఇళ్లను వైసీపీ ప్రభుత్వం శిథిలావస్థకు తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు ఇళ్ల పేరిట వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ఆరోపించారు.
2019లో వైసీపీ ప్రభుత్వం రాకుండా ఉంటే 3.13 లక్షల టిడ్కో ఇళ్లతో పాటు ప్రతి పేదవాడికి సొంతిల్లు దక్కేదని తెలిపారు. గతంలో టీడీపీ ప్రభుత్వం 90 శాతం వరకూ పూర్తిచేసిన టిడ్కో ఇళ్లను నిర్వీర్యం చేసిన జగన్ రెడ్డిని ప్రజలంతా ద్వేషిస్తున్నారని వెల్లడించారు. వైసీపీ రంగులేసుకున్న టిడ్కో ఇళ్లకు.. చెద పడుతున్నా, ఒక్క ఇల్లూ మంజూరు చేయలేదని మండిపడ్డారు. సెంటు పట్టా పేరుతో దోచుకున్న రూ. 7 వేల కోట్ల వివరాలు ఇప్పటికే ఆధారాలతో సహా బయట పెట్టామని స్పష్టం చేశారు.