By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 23, 2023, 6:58 PM IST
'ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఏం చేశారని సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు'
BJP SC Morcha Fired on YSRCP Bus Yatra: ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులకే వైసీపీలో కూర్చోడానికి కుర్చీలు లేవని.. అలాంటిది సామాజిక సాధికార పేరుతో యాత్ర చేయడం దుర్మార్గమని కడపలో బీజేపీ ఎస్సీ మోర్చా ఆరోపించింది. దళిత మంత్రులైనా ఆదిమూలపు సురేశ్ వంటి నాయకులు ఇప్పటికైనా మారాలని.. బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షులు దేవానంద్ సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందని.. కడపలో సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. తక్షణమే ఈ యాత్రను రద్దు చేయాలన్నారు.
ఎస్సీ అభివృద్ధి నిధులను వైసీపీ పక్కదారి పట్టించి మొండిచేయి చూపించిన వైసీపీకి.. ఎస్సీలు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎస్సీలపై దాడులు అధికమయ్యాయని ఆరోపించారు. ఇంకా ఎంతకాలం ఎస్సీలను మోసం చేస్తారని ప్రశ్నించారు. ఈ స్థాయిలో దాడులు ఏ ప్రభుత్వ హయాంలో జరగలేదన్నారు. కడప నగరంలో బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేస్తూ నగరాన్ని హోరెత్తించారు.