Anganwadi Workers Protest in Vijayawada: సమస్యల పరిష్కారానికై.. ఈనెల 27న విజయవాడలో అంగన్వాడీల రాష్ట్ర సదస్సు
Anganwadi Workers Stage Protest in Vijayawada : అంగన్వాడీల సమస్యల పరిష్కారానికై ఐక్య ఉద్యమ లక్ష్యంతో అంగన్వాడీ కార్మికుల రాష్ట్ర సదస్సును నిర్వహిస్తున్నామని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ నాయకులు తెలిపారు. విజయవాడ దాసరి భవన్లో సదస్సుకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. అంగన్వాడీ వర్కర్ల, హెల్పర్ల సమస్యల పరిష్కారానికి ఐక్య ఉద్యమాలే శరణ్యమని ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ అంగన్వాడీ సంఘాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జె.లలిత, విఆర్ జ్యోతి అన్నారు. ఈ నెల 27 విజయవాడ మొగల్రాజపురంలోని సిద్దార్ధ కాలేజీ ఆడిటోరియంలో సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రెగ్యులర్ విధులు నిర్వహించే అంగన్వాడీలను స్కీం వర్కర్ల పేరుతో ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, చివరకి ఈఎస్ఐ, పీఎఫ్, గ్రాట్యుటీ ఏమీ లేకుండా చేశారని వాపోయారు. గత ఎన్నికలకు ముందు తెలంగాణా కంటే వేయి రూపాయిలు ఎక్కువ ఇస్తానని హామీ ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డి మాట తప్పారని అన్నారు. అక్కడి కంటే 2150 రూపాయిలు తక్కువ జీతం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. గౌరవ వేతనం పేరుతో అతి తక్కువ వేతనాలు ఇస్తూ యాప్ల పేరుతో పనిభారం పెంచి శ్రమ దోపిడీ సాగిస్తున్నారని మండిపడ్డారు.