పెన్షనర్ల హక్కుల కోసం పార్టీ పెట్టి పోరాటం చేయాల్సిన దుస్థితి ఏర్పడింది : ఎల్వీ సుబ్రహ్మణ్యం - AP Pensioners Party
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 2, 2023, 7:16 PM IST
Andhra Pradesh Pensioners Party Formation: విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులో పెన్షనర్ల హక్కుల కోసం రాజకీయ పార్టీ పెట్టి పోరాటం చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని విశ్రాంత ఐఏఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్నారు. విజయవాడలో ఏపీ పెన్షనర్స్ ఏర్పాటు చేసిన ఆవిర్భావ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజ్యాంగం అమలు చేసే వ్యక్తులు సరైన వాళ్లు అయితే అందరి హక్కులు కాపాడతారని అన్నారు. వ్యవస్థలు సక్రమంగా నడిచినప్పుడు వ్యక్తుల స్వాతంత్రం రక్షణగా ఉంటుందన్నారు. పెన్షనర్ల హక్కులను రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తోందని అందుకోసమే రాజకీయ పార్టీ పెట్టి తమ హక్కుల కోసం పోరాడాల్సి వస్తుందని ఏపీ పెన్షనర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బరాయన్ తెలిపారు.
సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి విస్మరించారన్నారు. సకాలంలో పెన్షన్లు అందక విశ్రాంత ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ హక్కుల కోసం పోరాడేందుకు ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ పార్టీ ఏర్పాటు చేశామని రాబోయే ఎన్నికల్లో అన్ని అర్బన్ ప్రాంతాలలో పెన్షనర్స్ పార్టీ పోటీలో ఉంటుందన్నారు. పెన్షనర్ల హక్కుల కోసం, యువత భవిష్యత్తు కోసం తమ పార్టీ పోరాటం చేస్తుందన్నారు.